Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈమేరకు మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కానుంది. ఎన్నికలకు అవసరమైన ముందస్తు ప్రక్రియ తప్పుల తడకగా చేశారని పేర్కొంటూ దాఖలైన రెండు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) హైకోర్టు కొట్టివేసింది. పిల్స్లో జోక్యం చేసుకునేందుకు ఏమీ లేదని తేల్చి చెబుతూ తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 243(జెడ్) ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, ఈ మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయని, దీంతో పిల్స్లో జోక్యం చేసుకోవడం లేదని తీర్పులో పేర్కొంది. ఇప్పటికే ఎన్నికల ముందస్తు ప్రక్రియ మొదలైందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని తీర్పు చెప్పింది. ఈ మేరకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ కీలక తీర్పు చెప్పింది.
మున్సిపల్ యాక్ట్లోని సెక్షన్ 11 ప్రకారం శాసనసభ ఎన్నికల ఓటర్ల జాబితా మేరకు మున్సిపల్ ఎన్నికలను నిర్వహించవచ్చునని స్పష్టం చేసింది. ఆ జాబితా సిద్దంగా ఉన్నప్పుడు ఇప్పుడున్న సాంకేతికతను ఉపయోగించుకుని సత్వరమే రిజర్వేషన్లు వర్గీకరణ చేయడం కష్టమేమీ కాదని స్పష్టం చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ రిజర్వేషన్ల వర్గీకరణలో తప్పులు జరిగినట్టుగా ఎక్కడా ఓటర్లు చెప్పలేదని తప్పుపట్టింది. 2019 జులై 3న ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేయలేదని, దానిని చాలెంజ్ చేయడం చెల్లదని తీర్పులో తేల్చింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఓటర్ల లిస్ట్ తయారు చేసుకోవచ్చునని, ఎలక్షన్ క్యాలెండర్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించలేదు కాబట్టి ఆ నోటిఫికేషన్ను సవాల్ చేయడం చెల్లదు..తీర్పు చెప్పింది.
తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్రావు కల్పించుకుని.. సింగిల్ జడ్జి వద్ద కూడా మున్సిపల్ ఎన్నికలపై కేసులు ఉన్నాయని, పలు కేసుల్లో స్టేలు కూడా వెలువడ్డాయని, వాటి విషయంలో డివిజన్ బెంచ్ జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన డివిజన్.. వాటి విషయంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. అయితే సింగిల్ జడ్జి దగ్గరే ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. తమ ముందున్న పిల్స్ విషయంలో తాము తీర్పు చెప్పామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 128 మున్సిపాల్టీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల గడువు పూర్తి కాలేదు. దీంతో మిగిలిన పది కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది. 128 మున్సిపాల్టీల్లో 77 మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్జడ్జి స్టే ఆదేశాలిచ్చారు. వీటి విషయంలోనూ న్యాయపర మైన అవరోధాలు తొలగింపునకు ఆదేశాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయాన్ని సింగిల్ జడ్జి దగ్గరే పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ తెలిపింది. నిర్మల్ జిల్లాకు చెందిన కె.అన్జుకుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్లో మున్సిపల్ వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల ఖరారు చట్ట నిబంధనల ప్రకారం చేయలేదన్నారు. రాజ్యాంగంలోని 243 జెడ్(జి) ఆర్టికల్ ప్రకారం ఎన్నికల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని, రాజ్యాంగంలోని 329 ప్రకారం అయిదేండ్ల గడవు ముగిసిన మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. పిల్స్పై సుదీర్షంగా విచారించిన డివిజన్ బెంచ్ ఈ నెల 1న వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేసినప్పుడే ఎన్నికల ముందస్తు ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. ఈ పిల్స్లో స్టే ఇవ్వలేదని కూడా అప్పుడే స్పష్టం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేయరాదని అప్పుడు ఆదేశించగా ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయేలా ఆ పిల్స్ను డిస్మిస్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. పాలకమండళ్ల అయిదేండ్ల గడువు ఈ ఏడాది జులై 2తో ముగిసిందని, మున్సిపల్ యాక్ట్లోని 10కి భిన్నంగా ముందస్తు ఎన్నికల ప్రక్రియ గడువు కుదిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఆ తర్వాత జీవో 459 జారీ చేయడాన్ని సవాల్ చేసిన పిల్స్లో జోక్యం చేసుకోబోమని తీర్పులో పేర్కొంది. రాజ్యాంగంలోని 243 యు(3) ప్రకారం అయిదేండ్ల పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఆయా మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించాలని తీర్పులో పేర్కొంది. . నిర్ణీత గడువులోగా ఓటర్ల జాబితా, వార్డుల విభజన వంటివి ప్రభుత్వం చేయకపోవడం వల్ల రాష్ట్ర ఎన్నికల సంఘమే ముందుగా హైకోర్టుకు వచ్చింది. సింగిల్ జడ్జి వద్ద దాఖలైన పలు కేసుల్లో తీర్పు వెలువడింది. ముందస్తు ప్రక్రియకు 109 రోజులు, ఆపై మరో పది రోజులు సమయం తీసుకుని ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. సింగిల్ జడ్జి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందస్తు ఎన్నికల ప్రక్రియ గడువు కుదించి పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ వద్ద పిల్స్ దాఖలయ్యాయి. ఇవి విచారణలో ఉండగానే రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డుల విభజన వంటి అంశాలపై పలు రిట్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన హైకోర్టు సింగిల్జ్ జడ్జి సుమారు 70 మున్సిపాల్టీల ఎన్నికలపై స్టే మంజూరు చేశారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పు వెలువడిన వెంటనే సింగిల్ జడ్జి వద్ద ఉన్నకేసుల్ని కూడా పరిష్కరించాలని, ఎన్నికలు అడ్డంకులు తొలగేలా చేయాలని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ కోరారు. అందుకు డివిజన్ బెంచ్ అంగీకరించలేదు. స్టే ఇతర అంశాలపై సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి బదులిచ్చింది. పిల్స్ విచారణ సమయంలో మాత్రం ప్రభుత్వం కోర్టు స్టే ఉత్తర్వులు లేని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. అందుకు తాము కూడా సిద్ధమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏ మున్సిపాల్టీకి ఆ మున్సిపాల్టీ చూడాలని, అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చట్టంలో లేదని కూడా చెప్పింది. డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో స్టేలున్న మున్సిపాల్టీల వ్యవహారంపై ప్రభుత్వం ఏనిర్ణయం తీసుకుంటుందో మరి..!