Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన ఉధృతం.. : ఆర్టీసీ సమ్మె చారిత్రాత్మకం
- హక్కులు సాధించే వరకూ ఉద్యమం : తమ్మినేని
- ఆందోళన ఉధృతం చేస్తాం : సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బాలమల్లేశ్, పద్మ, సూర్యం
- సమ్మెకు మద్దతుగా బస్సు యాత్రలు
నవతెలంగాణ- మహబూబ్నగర్నగర్ ప్రతినిధి
రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్పై ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వ బృందాలు మంగళవారం ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో వేర్వేరుగా పర్యటించాయి. కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభల్లో తమ్మినేని మాట్లాడారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీలో సూపర్వైజర్లు మొదలుకుని మెకానిక్ల దాకా ప్రతి ఒక్కరూ పాల్గొనడంతో ఈ సమ్మె చారిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు. ఆర్టీసీని ప్రయివేటీకరిస్తే రాష్ట్రంలోని 4 కోట్ల మంది ఇక్కట్లపాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మెను సత్వరం విరమించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కోర్టు ఉత్తర్వు ప్రతులు అందలేదని ప్రభుత్వం బుకాయించడం అత్యంత దారుణమన్నారు. కేరళలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోయినా.. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ధీటుగా ఆర్టీసీ కార్మికులకు అలవెన్సులతో పాటు పింఛన్ సౌకర్యం కల్పిస్తున్న విషయం సీఎం కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. అక్కడ ఆర్టీసీకి నష్టం వస్తే ప్రభుత్వమే భరిస్తోందని, బెంగాల్లోనూ సీపీఐ(ఎం) అధికారంలో ఉన్నప్పుడు నష్టాల్ని సర్కారే భరించిందని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర బంద్ విజయవంతమైన తర్వాతైనా ప్రభుత్వం ధోరణి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు అడిగినవి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఖజానా లేదనడం సబబు కాదని చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, దేశంలోనే ముందు వసుసలో ఉన్నదని ఓవైపు చెబుతూ.. మరోవైపు కార్మికుల పొట్టలుగొట్టే యత్నాలు చేయడం సరైంది కాదన్నారు. కోర్టు ఆదేశాలు, మేధావుల సూచనలు, సలహాలు పాటించకుండా ఒంటెద్దు పోకడలతో సీఎం కేసీఆర్ చేసేదేమీలేదన్నారు. పిలిప్పీన్స్ దేశంలో పాలకులు నియంతల్లా మారితే ఏడాది తిరగకముందే ప్రజలు గద్దె దింపిన విషయం సీఎం మరువరాదన్నారు. ఈ సమ్మె ఆర్టీసీ కార్మికుల కోసమే కాదు నాలుగు కోట్ల ప్రజల శ్రేయస్సు కోసమని చెప్పారు. హక్కులను సాధించుకునే దాకా ఉద్యమ పంథాను వీడొద్దని కార్మికులకు పిలుపునిచ్చారు.
సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేష్ మాటా ్లడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యను పరిష్కరిం చకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల వల్లే కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. ఆర్టీసీని ప్రయివేటుపరం చేసి వేల కోట్ల ఆస్తులను కాజేయాలనే కుట్రలకు సీఎం కేసీఆర్ పాల్పడుతున్నారని విమర్శించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పద్మ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులవి గొంతెమ్మ కోర్కెలేవీ కావన్నారు. గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతుంటే.. సెల్ప్ డిస్మిస్ అంటూ కొత్త వివాదాలకు తెర లేపడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్, జాన్వెస్లీ, రాష్ట్ర నాయకులు రమ, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డిస్మిస్ చేసే అధికారం సీఎంకు లేదు
ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసే అధికారం సీఎం కేసీఆర్కు లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు సూర్యం అన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చేపట్టిన బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన మెదక్ డిపో ఎదుట కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. నిరంకుశ పాలనపై సకల జనులు ఉద్యమించాల్సిన రోజులు వచ్చాయన్నారు. ఆర్టీసీలో 10,450 బస్సులుంటే అందులో 5 వేల వరకు డొక్కు బస్సులే ఉన్నాయని చెప్పారు. ఆయన వెంట సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్, సీపీఐ రాష్ట్ర నాయకులు మంద పవన్ తదితరులు పాల్గొన్నారు.
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి