Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రయోజనాలకు నష్టంహైదరాబాద్ కోఠి
ఎస్బీఐ సమ్మె సభలో వామపక్ష నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బ్యాంకుల విలీనం దేశ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం చేకూర్చు తున్నదనీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకోవడం ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమని పలువురు వక్తలు అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా హైదరాబాద్లోని కోఠిలో గల ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం నాడు ఏఐబీఈఏ, బీఈఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె చేపట్టారు. సమ్మెకు సీపీఐ(ఎం), సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐబీఈఏ నాయకులు శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ... మోడీ సర్కారు విధానాలతో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. కార్పొరేట్లకు పట్టం కట్టేందుకు బ్యాంకులను నిర్వీర్యం చేసే కుట్రకు మోడీ తెరలేపారని విమర్శించారు. దేశంలో ఆర్థిక మాంద్యం పెరుగుతున్నదనీ, నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరిగేలా చూసి బ్యాంకులు దివాలా తీసేలా మోడీ చేసారనీ, ఇంట్లో ఈగలమోత...బయటనేమో పల్లకిమోత అన్న చందంగా ఆయన పాలన ఉన్నదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ... ప్రతి 12 వేల మందికి ఓ బ్యాంకు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తరిస్తున్న సందర్భంలో వాటిని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కారు పూనుకోవడం దారుణమని విమర్శించారు. తెలంగాణకు తలమానికంగా ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ను, ఆంధ్రాబ్యాంకు, తదితర బ్యాంకులను వేరే బ్యాంకుల్లో విలీనం చేయడం సబబుకాదన్నారు. యావత్తు బ్యాంకు ఉద్యోగులు తీవ్ర
అసంతృప్తితో, మానసిక వేదనతో ఉండటానికి కేంద్రం వైఖరే కారణమన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ...బ్యాంకుల విలీనం దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగ వ్యవస్థకు తీవ్ర నష్టమన్నారు. ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల నష్టాలకు కార్పొరేట్ వ్యాపారులే కారణమనీ, వారి నుంచి మొండి బకాయిలను వసూలు చేయడంలో ప్రభుత్వ సహకారం పూర్తిగా కొరవడిందని అన్నారు. ఆ కార్పొరేట్శక్తులే నేడు ప్రయివేటు బ్యాంకులు పెట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులపై దుష్ఫచారం చేస్తున్నారన్నారు. నోట్ల రద్దు వల్ల నల్లధనానికి అడ్డుకట్ట వేయవచ్చునని మోడీ సర్కారు ప్రచారం చేసిందనీ, వాస్తవానికి ఆ నల్లధనమంతా వైట్మనీగా మార్చడంలో అది ఉపయోగపడిందనీ విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారన్నారు. యూనియన్ బ్యాంకులో ఆంధ్రా బ్యాంకు విలీనం చేయడం వల్ల దానిపేరే కనుమరుగు కాబోతున్న దన్నారు. నిజాం కాలంలో ఏర్పాటైన స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ ఇప్పటికే కనుమరుగైపోయిందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వీర్యం 20 ఏండ్ల నుంచే సాగుతున్నదన్నారు. ఒక్కసారి బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రారంభమైతే....ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికే ఉండదనీ, బ్యాంకు ఉద్యోగుల సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాబ్యాంకు కనుమరుగు అవుతుంటే రెండు రాష్ట్రాల సీఎంలు అడ్డుకోవాల్సిందిపోయి కేంద్రానికి డూడూ బసవన్నలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓవైపు ప్రయివేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతూనే...అవే పార్టీలు విమర్శలు చేసుకుంటూ ద్వంద్వ విధానాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయనీ, దీన్ని ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు నరసింహన్, ఏఐబీఈఓ ప్రధాన కార్యదర్శి రాంబాబు, బెఫీ ప్రధాన కార్యదర్శి పి.వెంకట్రామయ్య, తదితరులు పాల్గొన్నారు.