Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ జేఏసీతో చర్చలకు ఓకే..
- ఆరుగురు ఈడీలతో కమిటీ
- కోర్టు ఆదేశాలపై సీఎం సుదీర్ఘ సమీక్ష
- విలీనం లేదు.. 21 అంశాలపైనే చర్చలు
- సర్కారు ముందస్తు షరతులు
- కేంద్రం తెచ్చిన ఎమ్వీ యాక్ట్ సవరణ బిల్లును అమలు చేస్తున్నాం
- ప్రయివేటుకే ఆర్టీసీ
- ప్లీజ్.. మా పొట్టలు కొట్టొద్దు..
- తాత్కాలిక సిబ్బందికి ఆర్టీసీ కార్మికుల వినతి
- కొనసాగిన ప్రభుత్వ నిర్బంధం
- పలుచోట్ల కార్మికుల అరెస్టులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది. దీనికోసం టీఎస్ఆర్టీసీలోని ఆరుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఈడీ)తో ఓ కమిటీని వేస్తున్నట్టు ప్రకటించింది. అయితే చర్చలకు ముందస్తుగా రెండు షరతులు విధించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ను స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్టు కార్మిక సంఘాలు కోర్టుకు తెలిపినందున, ఆ ఒక్కటీ మినహాయించి, కోర్టు చెప్పిన 21 డిమాండ్లపైనే చర్చలు జరపాలని సూచించింది. అలాగే ఆర్టీసీ ప్రయివేటీకరణపై వెనక్కి తగ్గలేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మోటారు వాహన సవరణ చట్టం-2019ని రాష్ట్రంలో అమలు చేస్తామని, ఈ చట్టం ప్రకారం ఆర్టీసీలోకి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని స్పష్టం చేసింది. ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపమని హైకోర్టు ధర్మాసనం ఈనెల 18వ తేదీ ఆదేశించిన విషయం తెలిసిందే. 19వ తేదీ ఉదయం 10.30 గంటలకు చర్చలు జరపమని కూడా న్యాయస్థానం పేర్కొన్నది. అయితే కోర్టు కేవలం చర్చలు జరపమని సూచన మాత్రమే చేసిందనే ప్రచారం జరిగింది. కానీ మంగళవారం ప్రభుత్వానికి అందిన కోర్టు ఉత్తర్వుల్లో చర్చలు జరపాల్సిందేనంటూ ధర్మాసనం సూచన కాకుండా ఆదేశాలే జారీ చేసింది. దీనితో తప్పనిసరై ప్రభుత్వం చర్చలకు సుముఖత వ్యక్తం చేయక తప్పలేదు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజూ ఉధృతంగా కొనసాగింది. వామపక్షపార్టీలు రెండు బృందాలుగా ఏర్పడి ఆయా జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. కార్మికులతో మమేకమై ధైర్యం చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు బీ వెంకట్, జాన్వెస్లీ, సీపీఐ జిల్లా నాయకులు బాలనర్సింహా, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కె రమతోపాటు పలు ప్రజాసంఘాల నేతలతో కూడిన బృందం కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట డిపోల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నది. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జున్, సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు సూర్యం, సీపీఐ నాయకులు మంద పవన్ తదితరులతో కూడిన మరో బృందం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని డిపోల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నది. టీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పూలు ఇచ్చి, సమ్మె ప్రాధాన్యతను తెలిపి, తమ పొట్ట కొట్టొద్దని వేడుకున్నారు. దీనితో పలు జిల్లాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధుల నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. యాదగిరిగుట్ట, ఖమ్మంలో ఈ తరహా ప్రచారం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. తాత్కాలిక డ్రైవర్లను ఇబ్బంది పెడితే కేసులు పెట్టి, అరెస్టు చేస్తామంటూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీబస్టేషన్లో వంటావార్పు నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఈ అశ్వత్థామరెడ్డి (టీఎమ్యూ), కో కన్వీనర్లు కె రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్), వీఎస్ రావు (స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్), ఓ సుధ (సూపర్వైజర్స్ అసోసియేషన్) పాల్గొన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, రావుల చంద్రశేఖరరెడ్డితో పాటు ఇతర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె-ప్రభుత్వవైఖరి అంశంపై ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు.
కమిటీ ఇదే...
టీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) టి.వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా ఇతర ఈడీలు ఎ.పురుషోత్తం,
సి. వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్లు సభ్యులుగా కమిటీని నియమించారు.