Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటెండర్ చంద్రయ్య పరిస్థితి ఆందోళనకరం
- చికిత్స పొందుతున్న రైతు
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో ప్రధాన నింది తుడు సురుష్ మృతిచెందాడు. ఆస్పత్రి చికిత్స పొందుతూ గురు వారం చనిపోయాడు. ఈనెల 4న సోమవారం కూర సురేష్ అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై కార్యాలయంలోనే పెట్రోల్ పోసి నిప్పటించడంతో సజీవ దహనమైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక
బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందతుడు సురేష్ గురువారం మధ్యహ్నం 3:30 గంటలకు మృతిచెందాడు. తహసీల్దార్ రక్షించే యత్నంలో గాయపడిన అటెండర్ చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అదేవిధంగా, ఈ ఘటనలో అక్కడే ఉన్న రైతు బొడిగ నారాయణ(70) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కవాడిపల్లి గ్రామానికి చెందిన నారాయణ తండ్రి రాజయ్యకు ప్రభుత్వం 50 ఏండ్ల కిందట ఐదున్నర ఎకరాల భూమిని కేటాయించింది. ఇటీవల ఆ కుటుంబానికి సమాచారమివ్వకుండానే పీవోటీ చట్టం కింద సర్కారు స్వాధీనం చేసుకుంది. ఫలితంగా నారాయణకు రైతుబంధు అందలేదు. అప్పటి నుంచి న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. సోమవారం తహసీల్దార్ విజయారెడ్డికి మంటలంటుకున్నప్పుడు నారాయణ అక్కడే ఉన్నాడు. మంటల్లో కాలుతూ తహసీల్దార్ విజయారెడ్డి డోర్ వద్దకు రావడంతో గోడ వద్ద ఉన్న నారాయణకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముగిసిన అంత్యక్రియలు
నిందితుడు సురేష్ మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు గౌరెల్లికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో హయత్నగర్ నుంచి గౌరెళ్లి వెళ్లే మార్గంలో సురేష్కు మద్దతుగా కొన్ని బ్యానర్లు వెలువడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తహసీల్దార్ హత్య ఘటనలో కొందరు సురేష్కు మద్దతుగా నిలుస్తుండటంతో అనుకోని పరిణామాలు జరిగే అవకాశాలున్నాయని అనుమానించిన పోలీసులు అంత్యక్రియలను తొందరగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
కొనసాగుతున్న విచారణ
పక్కా పథకం ప్రకారమే తహసీల్దార్ హత్య జరిగిందా? ఆ సమయంలో ఎమ్మార్వో ఆఫీసు బయట ఉన్న ఇద్దరు వ్యక్తులెవరు? ఘటన తర్వాత నిందితుడు సురేష్ వారితో ఏం మాట్లాడాడు? హత్యకు ముందు విజయారెడ్డి గదిలో ఏం జరిగింది? సురేష్కు, విజయారెడ్డికి మధ్య వాగ్వాదానికి కారణం ఏంటనే దానితోపాటు తదితర అంశాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఇదిలావుండగా తహసీల్దార్ కార్యాలయంతోపాటు విజయారెడ్డి ఇంటి సమీపంలోని సీసీకెమెరాల ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. విజయారెడ్డి హత్యకు ముందు ఆమె ఇంటి వద్ద నిందితుడు సురేష్ రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. ఘటనకు రెండ్రోజుల ముందు ఆమె ఇంటి దగ్గర విజయారెడ్డి భర్తతో సురేష్ మాట్లాడినట్టు కూడా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, సురేష్ కోలుకున్న తర్వాత కేసుకు సంబంధించిన అన్ని విషయాలను రాబట్టొచ్చని పోలీసులు భావించారు. కానీ, అతని మృతితో వివరాల సేకరణకు వీలవ్వలేదు. హత్య అనంతరం పోలీసుస్టేషన్కు నడుచుకుంటూ వెళ్లిన సురేష్.. అక్కడ కానీ.. ఆస్పత్రికి తరలించాక కానీ ఏమైనా చెప్పి వుంటే.. దాన్నే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే సీడీఆర్ (కాల్ డిటేయిల్స్ రికార్డు)ను పరిశీలిస్తున్నారు. ఆరు నెలల నుంచి సురేష్ ఎవరెవరితో మాట్లాడాడో ఆరా తీస్తున్నారు. మరోవైపు తన కుమారుడు తప్పు చేయలేదని, ఎవరో వెనుక ఉండి తప్పు చేయించారని సురేష్ కుటుంబసభ్యులు చెబుతుండటంతో ఆ దిశగా మరో బృందం విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు మరికొంత మందిని విచారించే అవకాశముంది.