Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీఐ, టీజేఎస్, న్యూడెమోక్రసీ నేతల అరెస్టులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిర్వహించతలపెట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకూ ర్యాలీ నిర్వహించాలని పార్టీలు, సంఘాలు పిలుపునిచ్చిన సంగతి విదితమే. దీంతో ఉదయం 5 గంటల నుంచే సుందరయ్య పార్కు చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. ఉదయం 10 గంటల నుంచే సీపీఐ (ఎం), సీపీఐ, టీజేఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఐద్వా, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, పీడీఎస్యూ, పీవైఎల్ నాయకులు, కార్యకర్తలు పార్కు చుట్టు పక్కలకు చేరుకున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా వారు పెద్ద పెట్టున నినాదాలిచ్చారు. 'సేవ్ ఆర్టీసీ, సేవ్ ఆర్టీసీ, ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి నశించాలి, కార్మికుల ఐక్యత వర్థిల్లాలి...' అనే నినాదాలతో వారు పరిసర ప్రాంతాలను హోరెత్తించారు. అయితే పోలీసులు.. నేతలెవర్నీ సుందరయ్య పార్కు దాటనివ్వలేదు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందున్న రోడ్డును బారికేడ్లతో రెండు వైపులా మూసివేసి, వచ్చిన నాయకులు, కార్యకర్తల్ని వచ్చినట్టు అరెస్టు చేశారు. నినాదాలు, తోపులాటలు, అరెస్టులతో దాదాపు ఒంటి గంట వరకూ ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. పోలీసులు ప్రదర్శన చేపట్టకుండా అడ్డుకోవటంతో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, బి.వెంకట్, సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎమ్.శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములుతోపాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలిచ్చారు. అనంతరం పోలీసులు వారందర్నీ అరెస్టు చేశారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కూడా ఎస్వీకే ముందు రోడ్డుపై బైఠాయించి నినాదాలిచ్చారు. ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించటంతో దాదాపు పావుగంట సేపు ఆమె ప్రతిఘటించారు. ఆమెను పోలీసులు అక్కడి నుంచి తరలించి, అరెస్టు చేశారు. సీపీఐ నగర కార్యదర్శి ఈ.టి.నర్సింహా, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నేతలు పోటు రంగారావు, కె.రమ, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఈశ్వరరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకురాలు సూర్యం, ఎస్ఎల్ పద్మ, అరుణ తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్కు వారిని తరలించారు. అక్కడ సీపీఐ (ఎం), ఇతర వామపక్షాల నేతలు అక్టోబరు విప్లవ వార్షికోత్సవ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యకర్తలనుద్దేశించి సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ ప్రసంగించారు.