Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 245 ఓట్లతో రెండోసారి గెలుపు
- ఇది కార్మిక విజయం : రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
నవతెలంగాణ-పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని భారీ తరహా పరిశ్రమల్లో ఒకటైన తోషిబాలో శనివారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్పై సీఐటీయూ ఘన విజయం సాధించింది. కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఐటీయూకే వరుసగా రెండోసారి కార్మికులు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో సీఐటీయూ తరఫున యూనియన్ రాష్ట్ర నాయకులు జె.మల్లికార్జున్, బీఎంఎస్ నుంచి సత్యనారాయణ, ఐఎన్టీయూసీ నుంచి జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి బరిలో నిలిచారు. పరిశ్రమలో మొత్తం 962 ఓట్లకుగాను 945 ఓట్లు పోలవ్వగా, అందులో మూడు ఓట్లు చెల్లలేదు. సీఐటీయూకు 487 ఓట్లు, బీఎంఎస్కు 242 ఓట్లు, ఐఎన్టీయూసీకి 213 ఓట్లు వచ్చాయి. సీఐటీయూ 245 ఓట్లతో విజయం సాధించింది. ఈ సందర్భంగా కార్మికులు పరిశ్రమలో బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. పరిశ్రమ నుంచి జాతీయ రహదారి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. తోషిబా పరిశ్రమ కార్మికులు రెండోసారి సీఐటీయూపై నమ్మకం ఉంచి గెలిపించాన్ని కార్మిక విజయంగా అభివర్ణించారు. కార్మికుల సంక్షేమం కోసం సీఐటీయూ ముందుండి పోరాడుతోందన్నారు. జిల్లాలో మెరుగైన వేతన ఒప్పందాలు చేయడం ద్వారానే కార్మికులు సీఐటీయూ పక్షాన నిలుస్తున్నారని అన్నారు. పరిశ్రమ యూనియన్ అధ్యక్షులు జె.మల్లికార్జున్ మాట్లాడుతూ.. రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో కార్మికులకు మరింత సేవ చేసే అవకాశం కలిగిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య, ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, నాయకులు నాగేశ్వరరావు, తోషిబా పరిశ్రమ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.