Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగని బలిదానాలు...
- కుటుంబాలు రోడ్డుపాలు
- ఇప్పటివరకు 23మంది కార్మికులు ఆత్మహత్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్ఆర్టీసీలో మృత్యుఘంటికలు మోగుతునే ఉన్నాయి. . కష్టాన్నే నమ్ముకున్న కార్మికులు ప్రభుత్వ కర్కశానికి బలవుతున్నారు. సర్కారు పెద్దలు అలక్ష్యం మూలంగా తట్టుకోలేని బడుగు గుండెలు ఆగిపోతున్నాయి. రెండు మాసాలుగా జీతాల్లేక కుటుంబపోషణ భారమై మానసికంగా కుంగిపోయి పలువురు బలన్మరణానికి పాల్పడ్డారు. ఇప్పటివరకు 23మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్య చేసుకోగా, కార్మికుల కుటుంబ సభ్యులు ఆరుగురు మానసీకక్షోభకు గురై తనువు చాలించారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన కార్మికులు న్యాయ స్థానంపై కొండంత ఆశను పెట్టుకున్నారు. గత నెల రోజులుగా హైకోర్టులో ఆర్టీసీపై సీరియస్గా వాదనలు జరుగుతున్నాయి. ఈసమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా పది మంది కార్మికులు గుండెపోటుకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో ఇద్దరు తనువు చాలించారు. పిల్లల ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు, గతంలో తీసుకున్న రుణాలకు చెల్లింపులు లేక కార్మికులు, కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు, ఎవరి చావు వార్త వినాల్సివస్తుందోనని కార్మికుల కుటుంబ సభ్యులు, మిత్రులు బిక్కుబిక్కుమంటున్నారు. ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డితో ప్రారంభమైన కార్మికుల ఆత్మహత్యల నేటికీ కొనసాగుతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడవద్దని అంతిమ విజయం మనదేనని జేఏసీ, అఖిలపక్ష నేతలు ధైర్యం చెబుతున్నా...కుటుంబ భవిష్యత్తుపై నిరుత్సాహానికి గురవుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రకటనలతో వారు మరింత కుంగిపోతున్నారు. కొలువులోంచి తొలగించామని ముఖ్య మంత్రి ప్రకటన చేసిన తర్వాతే కార్మికుల ఆత్మహత్య పరంపర మొదలయింది. ఇంతమంది ఆత్మహత్య చేసు కున్నా సీఎం కేసీఆర్గానీ, ప్రభుత్వం గానీ స్పందించడం లేదు. ఇక్కడ కాకపోతే పైకోర్టుకు పోతాం కానీ కార్మికులతో చర్చలు జరిపేదే లేదన్న సీఎం వ్యాఖ్యలు తన అహంకారానికి నిదర్శనం.. ఎక్కడో జరిగిన ఘోరాలపై స్పందించే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలు తెలంగాణ బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నా కనీసం సానుభూతి చూపకపోవడం దురదృష్టకరం. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని జేఏసీ, వామపక్షాలు, అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలతోనే కార్మికులు చనిపోయారని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. అంతిమవిజయం కార్మికులదేనని, ఎవరూ మానసిక ఆందోళనతో బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.