Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైబ్యాక్ ఒప్పందంతో ఎర్రజొన్న రైతులకు కుచ్చుటోపి
- క్వింటాకు రూ.2200 ధరకు ఒప్పందాలు
- ఆరు కిలోల తరుగు అగ్రిమెంట్తో విత్తనాల పంపిణీ
- రంగంలోకి ఢిల్లీ వ్యాపారులు.. రూ.2800కు అగ్రిమెంట్
- అంతర్మథనంలో మిగతా అన్నదాతలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
బైబ్యాక్ (తిరిగి కొనుగోలు) ఒప్పందంతోనే పంట సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం.. ఇతర ప్రత్యామ్నాయ సాగు తెలియకపోవడం... వెరసి ఎర్రజొన్న రైతులు మరోసారి దగా పడ్డారు. స్థానిక దళారుల చేతిలో నిండా మునుగుతున్నారు. పంటకు అత్యధికంగా డిమాండ్ ఉన్నప్పటికీ అతితక్కువ ధరకు ఒప్పందం చేసిన దళారులు ఇప్పటికే విత్తనాలు కూడా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాపారులు రంగంలోకి దిగి నేరుగా రూ.2800 వరకు రైతులతో అగ్రిమెంట్ చేసుకోవడంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని ఆర్మూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, భీంగల్, ఎర్గట్ల, ముప్కాల్, మెండోరా తదితర మండలాల్లో 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్నలు సాగు చేస్తారు. మూడు నెలల పంటకాలం ఉన్న ఈ ఎర్రజొన్నలు... నవంబర్ 15 నుంచి 30 వరకు సాగు పూర్తి చేస్తారు. జనవరి చివరిలో పంట చేతికొస్తుంది. ఒక్కో ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుమతి వస్తుంది. పంట పెట్టుబడికి రూ.25 వేల వరకు ఖర్చవుతోంది. ప్రతియేటా పంట చేతికొచ్చే సమయానికి వ్యాపారులు సిండికేట్గా మారి మార్కెట్లో ధర పడిపోయిందంటూ రైతులను మోసం చేయడం ఆనవాయితీగా మారింది. దీంతో 2017లో రాష్ట్ర ప్రభుత్వం కలుగచేసుకుని మార్కెఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2300 చొప్పున కొనుగోలు చేయించింది. అయితే మార్క్ఫెడ్కు సైతం తిప్పలు తప్పలేదు. ఎర్రజొన్నల అమ్మకానికి టెండర్లు వేస్తే దళారులంతా సిండికేట్గా మారి క్వింటాకు అతితక్కువగా రూ.1500 కోట్ చేశారు. దీంతో మార్క్ఫెడ్ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేసి గతేడాది రూ.1700 క్వింటాల్కు అమ్మింది. అయితే దళారులు మార్క్ఫెడ్ దగ్గర తీసుకుని ఢిల్లీలో క్వింటాల్కు రూ.2500కు విక్రయించారు.
బైబ్యాక్ ఒప్పందంతో భయం.. భయం
సాధారణంగా రైతాంగం పండించిన ఏ పంటకూ ఇప్పటి వరకు బైబ్యాక్ ఒప్పందాలు జరగలేదు. కానీ రాష్ట్రప్రభుత్వం ఈ యేడాది విత్తనాలు అమ్మిన వ్యాపారులే తిరిగి పంటను కొనుగోలు చేసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆదేశాలిచ్చింది. ఒప్పందం కుదిరాక మార్కెట్లో ధర పెరిగినా ముందస్తు అగ్రిమెంట్ మేరకే చెల్లిస్తారు. పెరిగిన ధరలు రైతులకు వర్తించవు. స్థానిక దళారులు దీన్ని అవకాశంగా తీసుకుని 20 రోజుల నుంచి ఒప్పందాలు ప్రారంభించారు. క్వింటాకు రూ.2200, ఆరు కిలోల తరుగుతో ఒప్పందాలు చేసుకుని రైతులకు విత్తనాలు అందజేశారు. అయితే అనూహ్యంగా ఢిల్లీలోని కొంతమంది వ్యాపారులు నేరుగా రైతులతో ఒప్పందాలకు దిగారు. క్వింటాకు ఏకంగా రూ.2600 నుంచి రూ.2800 వరకు ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం. అంకాపూర్తో పాటు మోర్తాడ్ తదితర గ్రామాల్లో ఈ ప్రక్రియ ఊపందుకోవడంతో ముందుగా రూ.2200కు ఒప్పందం చేసుకున్న రైతులు అంతర్మథనంలో పడ్డారు. స్థానిక దళారులు తమను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జోక్యం చేసుకుని డిమాండ్ మేరకు అత్యధిక ధరతో ఒప్పందం చేసుకునేలా చర్యలు చేపడితే బాగుండేదని వ్యవసాయ సంఘాల నేతలు, రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎర్రజొన్నల విషయంలో కఠిన ఒప్పందాలుండటంతో భవిష్యత్తులో పసుపు, ఇతర పంటల విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుందేమోనని రైతాంగంలో భయాందోళనలు నెలకొన్నాయి.
దళారులు సిండికేట్ అయ్యారు : వెంకటేష్, రైతు
ఎర్రజొన్న సాగులో రైతులకు ప్రయోజనం జరిగేలా ప్రభుత్వం చొరవచూపాలి. బైబ్యాక్ ఒప్పందం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. దళారులంతా సిండికేట్గా మారి మార్కెట్లో డిమాండ్ లేదనే పేరుతో తక్కువ ధరకు అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు. దీనివల్ల పంట పండించిన రైతుకన్న.. దళారులకు ఎక్కువ లాభం జరుగుతోంది.
ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన ఏదీ? : నందుమహేష్, రైతు
రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్నల బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని చెబుతోంది. కానీ ప్రత్యామ్నాయ పంటలపై ఇప్పటివరకు గ్రామాల్లో అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. మా ప్రాంతాల్లో మొక్కజొన్న, ఎర్రజొన్న, పసుపు సాగు చేస్తాం. మొక్కజొన్న సాగు చేద్దామంటే కత్తెరపురుగు బెడద తీవ్రంగా ఉంది. ఎర్రజొన్న పంట కత్తెరపురుగుకు తట్టుకుంటుంది కాబట్టి ఈ సాగు చేస్తున్నాం.