Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టి.. ఉత్తర్వులను జారీ చేయాలంటూ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్టు సీఎం వెల్లడించారు. వచ్చే వ్యవసాయ సంవత్సరం ప్రారంభం (జూన్)లోపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా రైతు సమన్వయ సమితులన్నింటినీ బలోపేతం చేయాలనీ, తద్వారా రైతు శక్తిని సంఘటితశక్తిగా మార్చాలనీ ఆయన నిర్ణయించినట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణాన్ని పూర్తి చేయాలనీ, విత్తనం వేసిన దగ్గర్నుంచి త పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకూ రైతులకు చేదోడు వాదోడుగా నిలవాలనీ సీఎం భావిస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం మూడు నాలుగు రోజుల్లోనే వ్యవసాయశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. తనను రైతు సమన్వయ సమితికి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు పల్లా.. ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రైతు సమన్వయ సమితికి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి విదితమే. ఆయన శాసనమండలికి చైర్మెన్గా ఎన్నికైన నేపథ్యంలో ఇప్పుడు పల్లాకు ఆ బాధ్యతలను అప్పగించారు.