Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ జేఏసీ నేతలు గృహనిర్బంధం
- ఇంట్లోనే అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష ొ కో కన్వీనర్లు లింగమూర్తి, రాజిరెడ్డి సైతం అరెస్ట్
- కొత్తగూడెంలో మహిళా కార్మికుల ఆత్మహత్యాయత్నొం పెట్రోల్, సిలిండర్, చాకులతో స్వీయ నిర్బంధం
- రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, కార్మికుల మధ్య ఘర్షణ
అరెస్టులు, గృహనిర్భందాలు, 144 సెక్షన్ అమలు, పోలీసు బలగాల మోహరింపు, వాహనాల తనిఖీలు, సవాలక్ష నిషేధాజ్ఞలు....ఇవేవీ ఆర్టీసీ కార్మికుల దీక్షల్ని ఆపలేకపోయాయి. అరెస్టులు చేస్తే పోలీస్స్టేషన్లనే దీక్షా శిబిరాలుగా మార్చేశారు. మా జోలికొస్తే...గ్యాస్ సిలిండర్లు పేల్చి ఆత్మత్యాగాలు చేస్తామంటూ మహిళా ఉద్యోగులు పోలీసుల్ని హడలెత్తించారు. నిర్బంధాల మధ్యే ఆందోళనలను కొనసాగుతున్నాయి. ఎక్కడా ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గలేదు. జేఏసీ నాయకులు చేపట్టిన నిరాహారదీక్షలను భగం చేసేందుకు పోలీసులు శతధా ప్రయత్నించారు. జేఏసీ కన్వీనర్ ఈ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ కె రాజిరెడ్డిని అర్ధరాత్రే అరెస్టు చేసేందుకు వారి ఇండ్లను పోలీసులు చుట్టుముట్టారు. సాధ్యం కాలేదు. శనివారం ఉదయం రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్)ని ఆయన ఇంటి వద్ద బలవంతంగా అరెస్టు చేసి పహడీషరీఫ్ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడే ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. కన్వీనర్ అశ్వత్థామరెడ్డి (టీఎమ్యూ) తన ఇంట్లోనే లోపలి నుంచి తలుపులు గడియ వేసుకొని దీక్షకు కూర్చున్నారు. మరో కో కన్వీనర్ జీ లింగమూర్తి (స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్) సీఐటీయూ ఆఫీస్ వద్ద దీక్షకు కూర్చున్నారు. పోలీసులు ఆయనతోపాటు ఎస్డబ్ల్యుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ రాంచందర్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. లింగమూర్తి కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం, మహబూబ్నగర్లో మహిళా కండక్టర్లు, ఉద్యోగులు యూనియన్ అఫీస్లో దీక్షలు చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. 'అతిచేస్తే'..గ్యాస్ సిలిండర్ పేల్చుకొని ఛస్తామంటూ మహిళా ఉద్యోగులు పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. దీనితో పోలీసులు వెనక్కి తగ్గారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు, అరెస్టులు కొనసాగాయి. ఎమ్ఆర్పీఎస్ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కార్మికసంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వడమే చట్టవిరుద్ధమని ఆర్టీసీ ఇన్చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్శర్మ శనివారం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రతిపక్షాలతో కలిసి జేఏసీ నేతలు ఆర్టీసీని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఇలాంటి సమ్మెలను ప్రోత్సహించవద్దని ఆ అఫిడవిట్లో కోరారు. సీఎం కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్టుపై సునీల్శర్మ సంతకాలు పెట్టారని, అది ఫక్తు రాజకీయ అఫిడవిట్లాగానే ఉందంటూ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఘాటుగా విమర్శించారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇదిలావుండగా ప్రయివేటు రూట్ల విషయంలో ప్రభుత్వ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, మధ్యలోనే న్యాయ సమీక్ష చేయడం సరికాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయగా, పీఎఫ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శాఖ కమిషనర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.
నవతెలంగాణ-యంత్రాంగం
ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా 43వ రోజు కొనసాగించిన బస్రోకో కార్యక్రమం ఉధృత రూపాన్ని తలపించింది. ప్రభుత్వం వెంటనే దిగిరావాలని జేఏసీ నేతలు నిరాహార దీక్షకు యత్నించగా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే వారి ఇండ్లను చుట్టుముట్టారు. సివిల్ డ్రెస్సుల్లో చేరుకుని వేర్వేరు వాహనాలతో వారి కాలనీల్లోకి పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం ఉదయం అశ్వత్థామరెడ్డి ఇంటికి వద్దకు వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు చేరుకోగా పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మరోఓఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో తోపులాటలు జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పలువురు మహిళా కార్మికులకు గాయాలయ్యారు. కొత్తగూడెంలో పెట్రోల్ బాటిల్ తీసుకుని స్వీయ నిర్బంధం చేసుకున్న మహిళా కార్మికులు సిలిండర్లు పేల్చుకుని ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న నిరవధిక నిరహార దీక్షను ఎక్కడికక్కడ పోలీసులు భగం చేశారు. శనివారం తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బలగాలతో కలిసి మీర్పేట్ పోలీసులు ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రెడ్డికాలనీలో ఉంటున్న కో కన్వీనర్ రాజిరెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నాయకులు, మహిళా కండక్టర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో దీక్షకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అశ్వత్థామరెడ్డిని బయటకు రాకుండా నిర్బంధించడంతో ఇంట్లోనే దీక్షకు దిగారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ జేఏసీ నేతలు అనేక అంశాలపై వెనక్కి తగ్గినప్పటికీ చర్చలకు పిలువకపోవడం ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. దాదాపు 23మంది ఆర్టీసీ కార్మికుల చావుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సామూహిక దీక్షలు, 19న హైదరాబాద్ నుంచి కోదాడ బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు. రాజిరెడ్డి నివాసం వద్ద ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేపట్టి కార్మికులను బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్కు తరలించారు. తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. గోవర్ధన్, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి. సంధ్యతో పాటు పలువురు నాయకులు అశ్వత్థామరెడ్డి ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. పీఓడబ్ల్యూనేత సంధ్య, న్యూడెమోక్రసీ నాయకులు గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నించగా అరెస్ట్ చేసి బాలాపూర్ స్టేషన్కు తరలించారు.
అన్ని జిల్లాల్లోనూ ఉధృతం
ఖమ్మంలో బస్టాండ్ గేటు ఎదుట బైటాయించి బస్సులను అడ్డుకున్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు ముక్కు నేలకు రాసి నిరసన తెలిపారు. మణుగూరులో తాత్కాలిక కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. నర్సంపేటలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బస్రోకో నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మిర్యాలగూడలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. యాదగిరిగుట్ట, సూర్యాపేటలో రాస్తారోకో చేపట్టగా వామపక్ష నాయకులు, కార్మికులను అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో పలువురు మహిళా కార్మికులు గాయపడ్డారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లో తోపులాట జరగ్గా.. పోలీసులు వ్యాన్లలోకి బలవంతంగా తోసివేయడంతో సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండారి శేఖర్ చేతులకు, వీపు భాగాలకు గాయాలయ్యాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్ను అడ్డుకునేందుకు ఎన్టీఆర్ చౌరస్తా వద్ద యత్నించిన సీపీఐ నాయకులను అరెస్టు చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కూన శోభారాణిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో వీపుపై, తలకు దెబ్బలు తగిలి కండ్లు తిరిగి కింద పడిపోయింది. మెదక్లో మహిళలని చూడకుండా చితకబాదారు. సంగారెడ్డి బస్సు డిపో ఎదుట మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 18 మంది మహిళా కార్మికులు బయటి నుంచి తాళం వేయించుకుని ఓ ఇంట్లో ఆమరణ దీక్ష నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు నిరసన సెగ తగిలింది.
సిలిండర్లతో పేల్చేసుకుంటాం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం తెల్లవారుజామున బస్సులను బయటకు రాకుండా కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మనోవేదనకు గురైన మహిళా కార్మికులు పదిమంది ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పది మంది మహిళా కార్మికులు పెట్రోల్ బాటిల్స్, చాకులు తీసుకుని బస్టాండ్ సమీపంలోని ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలోకి వెళ్లి గడియవేసుకున్నారు. ప్రభుత్వం తక్షణం చర్చలపై స్పందించకుంటే పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటామనీ, గదిలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేల్చేస్తామనీ, చాకులతో పీకలు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుమారు మూడు గంటల పాటు హైడ్రామా కొనసాగింది. అగ్నిమాపక సిబ్బంది సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాయకులు, పోలీసులు ఎంత బతిమిలాడినా మహిళా కార్మికులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు ఆవేశానికి గురై స్పృహకోల్పోయారు. పరిస్థితి మరింత విషమిస్తుండటంతో లోపల ఉన్న మహిళలు తలుపులు తెరిచారు. స్పృహకోల్పోయిన మహిళలను నాయకులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.