Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెగాస్టార్ చిరంజీవి
నవతెలంగాణ-హైదరాబాద్
'శ్రీదేవి, రేఖ లాంటి లెజెండర్లకు ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇవ్వడం ఎంతో సముచితం. ఇంత గొప్ప అవార్డును నా చేతుల మీదుగా వారికి ఇచ్చే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా' అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరపున అవార్డును భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేస్తున్నారు. 2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై అవార్డ్ను శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, నటి సురేఖలకు అందజేశారు. సమన్వయకర్తగా అక్కినేని నాగార్జున వ్యవహరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఎన్టిఆర్, ఏఎన్ఆర్ లాంటి లెజెండరీ పర్సన్స్ ఉన్న టైమ్లో తాను హీరోగా నిలదొక్కుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాగేశ్వరరావుతో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించడం తన అదృష్టమన్నారు. ఆయన సినిమా ఇండిస్టీ గురించి చెప్పిన ఎన్నో విషయాల వల్లే తాను ఈ రోజు ఈ స్థానానికి రావడానికి దోహద పడిందన్నారు. ఎంతో మంది మహామహులకు ఇస్తున్న ఈ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఏదో ఒక రోజు దాదాసాహెబ్ ఫాల్కే అంత గొప్ప అవార్డ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అవార్డ్ కమిటీ చైర్మెన్, కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి, అమల అక్కినేని, విజరు దేవరకొండ, సుమంత్, నాగచైతన్య, అఖిల్, నిహారిక, మంచు లక్ష్మి, శ్రీకాంత్, పాల్గొన్నారు.