Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన సోమేష్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముందస్తు ఎన్నికలకు ముందు వివిధ జిల్లాలకు బదిలీలు చేసిన తహసీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సోమేష్కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో జోన్ పరిధిలోని 212 మందిని, ఐదో జోన్లో పరిధిలోని 166 మందిని మొత్తంగా 378 మంది తహసీల్దార్లను గతంలో విధులు నిర్వహించిన జిల్లాలకు పంపారు. సార్వత్రిక ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి తమను సొంత జిల్లాలకు బదిలీలు చేయాలని తహసీల్దార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు లేఖలను అందజేశారు. విజ్ఞప్తులు చేశారు. ఈ క్రమంలోనే ఒత్తిళ్లకులోనై నిజామాబాద్ జిల్లాలో ఓ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగటం, మరోవైపు అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. రెవెన్యూ ఉద్యోగులంతా ట్రెసా, రెవెన్యూ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ట్రెసా ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తోనూ, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శితో పలుమార్లు భేటీ అయ్యి చర్చించారు. తాజాగా ఆది వారం నాడు కూడా ట్రెసా బృందం సోమేష్కుమార్ తో సమావేశమైంది. ఆ తర్వాత తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు వెలుబడ్డాయి.