Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ డాక్టర్ యన్.గోపి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనిషి జీవనయానంలో ప్రతి అనుభూతీ కవిత్వమేననీ, నిజాయితీతత్వం గల వ్యక్తుల నుంచే కవిత్వం జాలువారుతుందనీ తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్, ప్రముఖ కవి డాక్టర్ యన్.గోపి అన్నారు. తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో కవిత్వంతో ఒక రోజు పేరుతో యువ కవులతో సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యన్.గోపి మాట్లాడుతూ...'కులం' అనే అంశాన్ని పట్టుకుని వేలాడేవాడు అసలు కవే కారనీ, కవికి విశాల దృక్పథం ఉందని అన్నారు. ఎంత పెద్ద కవి అయినా నిత్య విద్యార్థియే అని అన్నారు. కవిత్వం రాయాలంటే నిజాయితీతో పాటు మనస్సు నిర్మలంగా ఉండాలనీ, లోపల ఒకటి అనుకోవడం, బయటకు ఒకటి వ్యక్తపర్చటం అసలు కవి లక్షణమే కాదన్నారు. కవికి ప్రాపంచిక దృక్పథం ఉండాలని నొక్కి చెప్పారు. వాటితోపాటు ప్రతి కవిలోనూ నెమ్మదితనం, మననం, నెమరువేత, క్లుప్తత, తదితర లక్షణాలు కచ్చితంగా ఉండాలనీ, కవిత రాయగానే అచ్చుకు పంపించవద్దనీ, తమవద్దనే కొంత కాలం ఉంచుకుంటే మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రతి కవి కూడా గతకాల అంశాలను సృశించినప్పటికీ ఎల్లప్పుడూ వర్తమాన కాలంలోనే జీవించాలని సూచించారు. సమాజంలో ప్రతియాసా, ప్రతి మాండలికమూ వేటికవే మధు రమైనవన్నారు. గొప్ప వక్తలందరూ గొప్పవ్యక్తులేం కాదనీ, హిట్లర్, తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ ఉదహరించారు. నేటి సమాజంలో మను షులు యాంత్రీకరణలో పడి కొట్టు కుపోతున్నారనీ, స్వేచ్ఛగా ఆలోచించకపోవడం, ప్రతిదానికీ సమయం లేదని చెప్పడం వంటి లక్షణాలు విపరీతమై పోయాయనీ, మానవ విలువలు రోజురోజుకీ దెబ్బతినిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వార్తాపత్రికలోని ప్రతివార్తనూ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ప్రతిరోజూ రెండు,మూడు కవితా వస్తువులు దొరుకుతాయని యువ కవులకు సూచించారు. చైనాలో 98 శాతం జనాభా ఒకే భాష మాట్లాడటం ద్వారా సోషల్ యూనిటీ ఎక్కువగా ఉంటుందనీ, అదే మనదేశంలో పలు భాషలు, కులాల పేరిట ప్రజలు చీలిపోయారన్నారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ సభ్యులు అనంతోజు మోహన్కృష్ణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేష్, సైదులు, సత్యనారాయణ, రంగస్థల కార్యకర్త శాంతకుమార్, తదితరులు పాల్గొన్నారు.