Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్ట్ చేసేందుకు పోలీసుల యత్నం
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
అరెస్టుకు ముందు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ కో-కన్వీనర్ జి.లింగమూర్తి దీక్షకు రాజకీయ పార్టీలు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో నేతలు వాగ్వాదానికి దిగారు. పరామర్శించి తిరిగి వెళ్లే క్రమంలో వారిని అరెస్టు చేసేందుకు యత్నించగా వాళ్లు ప్రతిఘటించారు. తాము నడుచుకుంటూ పోలీస్స్టేషన్కు వస్తామంటూ తేల్చిచెప్పి కొంతదూరం వెళ్లారు. పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం నేతలందరూ తమ ఇండ్లకే వెళ్లాలనీ, మరెక్కడకీ వెళ్లొద్దనీ ఆంక్షలు పెట్టి పంపించారు. అయినప్పటికీ నేతలపై నిఘాను వీడకుండా వారి వాహనాలను వెంబడించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు సుధాకర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, రమ, సూర్యం, గోవర్ధన్, బీజేపీ నాయకులు బి. మోహన్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇందిరా, ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు, రైతుసంఘం నాయకులు జంగారెడ్డి, జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ వేరువేరు సమయాల్లో సందర్శించి సంఘీభావం తెలిపారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవకపోవటాన్ని తీవ్రంగా ఖండించారు. ఐఏఎస్ అధికారి, ఇన్చార్జి ఎమ్డీ సునిల్శర్మ రాజకీయాల గురించి మాట్లడటం, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపబోమని ఆఫిడవిట్ దాఖలు చేయడం సరైన పద్ధతికాదన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనతో తెలంగాణ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి ఆర్టీసీపై తప్పుడు నివేదికలు ఇవ్వటం దారుణమన్నారు. దీక్షలకు అనుమతి నిరాకరించి, ఇండ్ల వద్ద దీక్షలు సాగిస్తున్న నేతల అరెస్టును ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలన్నారు. నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షలకు మద్దతుగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబశివ, టీఎంఎస్ఆర్యు రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర్రావు, బానుకిరణ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, జె.వెంకటేష్, వి.రాములు, బి.మధు, సీఐటీయూ నాయకులు వై.సోమన్న, ఎఐఆర్టిడబ్ల్యుఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్ మద్దతు తెలిపారు. దీక్ష శిబిరంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. రాంచందర్, రాష్ట్ర నాయకులు ఏవీ రావు, పి.రవిందర్రెడ్డి, రాంబాబు, కృష్ణ, జి.ఆర్.రెడ్డి, హైదరాబాద్ జోన్ అధ్యక్షులు చంద్రప్రకాశ్ పాల్గొన్నారు.