Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కందాళ వర్సెస్ తుమ్మల
- రచ్చకెక్కిన పదవుల పందేరం
- నియోజకవర్గమంతటా రెండేసి గ్రూపులు
- మాజీ మంత్రికి పొమ్మనలేక పొగ..!?
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. పూలమ్మిన చోటే కట్టెల మ్మినట్టుగా ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాను రాజకీయంగా శాసించిన తుమ్మలకు సొంత నియోజకవర్గంలోనే గ్రూపుల పోరు పొమ్మనలేక పొగబెడుతోంది. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటి నుంచీ తుమ్మలకు గులాబీ పార్టీలో ప్రాధాన్యత క్రమేపీ తగ్గుతోందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలోని పార్టీ పదవులన్నింటినీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తన అనుచరులకే కట్టబెట్టడంతో విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఇరుగ్రూపులు పోటాపోటీగా సమావే శాలు పెట్టుకుని పరస్పర విమర్శలతో రచ్చకెక్కిన దరిమిలా పాలే రు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది.
ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఇప్పటికి పదిసార్లు పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఐదుసార్లు గెలుపొందారు. 1985, 1994, 1999లో శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున తుమ్మల సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందగా, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజరు చేతిలో ఓడిపోయారు. అనంతరం ఇద్దరూ టీఆర్ఎస్లో చేరారు. అయితే, తుమ్మలకు ఎమ్మెల్సీ ఇచ్చి కేసీఆర్ మంత్రిని చేశారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం 2016 పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల 45వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ఎలాంటి రాజకీయ అనుభవం లేని కందాళ ఉపేందర్రెడ్డి చేతిలో 7,669 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఒకే ఒరలో రెండు కత్తులు
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కందాళ ఉపేందర్రెడ్డి అనంతరం టీఆర్ఎస్లో చేరారు. దీంతో నియోజకవర్గంలో కందాళ, తుమ్మల గ్రూపులు టీఆర్ఎస్ శ్రేణులు విడిపోయాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలైన విభేదాలు రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయి. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తుమ్మల గ్రూపు ఆరోపిస్తుండగా.. తమతో కలిసి రావడం లేదని కందాళ గ్రూపు అంటోంది. మరోవైపు పరామర్శల పేరిట ఇరు గ్రూపులు భారీ కాన్వారులతో నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. తిరుమలాయపాలెం జెడ్పీటీసీ టికెట్ను తుమ్మల గ్రూపు ఆశించగా, దానిని ఎమ్మెల్యే కందాళ అనుచరుడికి ఇవ్వడంతో.. వారు సహకరించక ఓడిపోయాడు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల ఏర్పాటు చేసిన మండల, గ్రామస్థాయి పదవులనూ కందాళ గ్రూపుకే ఇచ్చుకున్నట్టు తుమ్మల అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తమను సంప్రదించకుండా కందాళ నిర్ణయాలు తీసుకున్నారంటూ తుమ్మల గ్రూపు వారు రహస్య సమావేశమయ్యారు. ఈనెల 19న తామూ కొత్త కమిటీలు నియమిస్తామని కాలుదువ్వుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, కందాళ ఏకపక్ష నిర్ణయాలపై త్వరలో కేటీఆర్కు ఫిర్యాదు చేయడానికి సమాయత్తం అవుతున్నట్టు సమాచారం.
పెద్ద 'పాలేరు'కు పొమ్మనలేక పొగ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వంలో సీఎంకు నాలుగేండ్లు తుమ్మల కుడిభుజంగా పనిచేశారు. కానీ గత శాసనసభ ఎన్నికల్లో తుమ్మల ఓటమి తరువాత, టీఆర్ఎస్లో చేరిన కందాలకు అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అయితే, తుమ్మలకు కూడా ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు ఇస్తారనే ప్రచారం జరిగినా, అలాంటిదేమీ లేకపోగా పార్టీలో క్రమేపీ ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే చర్చ మొదలైంది. కావాలనే కొందరు రాజకీయంగా తుమ్మలను సాగనంపేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని అతని అనుచరులు అంటున్నారు.
భవిష్యత్తు కోసం సర్వే..?
ఉమ్మడి జిల్లాలో పట్టున్న తుమ్మల నాగేశ్వరరావుకు నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలకు తోడు సీఎం కేసీఆర్ నుంచి కూడా ఎలాంటి సానుకూల పవనాలూ రావడం లేదు. దీంతో ఆయన గులాబీ పార్టీకి గుడ్బై చెప్పుతారన్న చర్చ సాగుతోంది. ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్లో ఇమడలేమనీ, ప్రాధాన్యత ఉండే పార్టీలోకి వెళ్లడమే సరైనదనీ తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నట్టు వినికిడి. దీనిపై తుమ్మల కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. అయితే ఏ పార్టీలోకి వెళ్లాలనే అంశంపై స్పష్టత కోసం సర్వే చేయించుకున్నట్టు తెలిసింది. ఆ సర్వేకు అనుగుణంగా కాంగ్రెస్వైపు మొగ్గుచూపితేనే భవిష్యత్తు ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా పాలేరు నియోజకవర్గంలో కారు ఒకటేగానీ స్టీరింగ్లు మాత్రం రెండున్నాయనే చర్చ సాగుతోంది.