Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ నేతల దీక్ష భగం..
- ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో రాత్రి 11.30కు లింగమూర్తి దీక్ష భగం
- ఇంట్లోకి చొరబడి బలవంతంగా అశ్వత్థామరెడ్డి అరెస్ట్
- రాజిరెడ్డి ఇంటి తలుపులు పగులగొట్టిన పోలీసులు
- కార్మికులతో తీవ్ర తోపులాట.. వాగ్వాదం
- పలువురి మహిళలకు గాయాలు
- నగరంలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొంది. రోడ్లపై కనిపిస్తే చాలు అరెస్టు చేయడం...లాక్కెళ్లి వ్యాన్లల్లో కుక్కేయడం... జేఏసీ నేతల ఇండ్ల తలుపులను బద్దలు కొట్టి మరీ అరెస్టు చేయడం... బలవంతంగా ఆస్పత్రులకు, పోలీస్స్టేషన్లకు తరలించడం వంటి పరిణామాలతో రాజధాని నగరంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తన స్వగృహంలో దీక్ష కొనసాగిస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ఉస్మానియాకు తరలించారు. కో కన్వీనర్ రాజిరెడ్డిని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న ఎస్డబ్ల్యూఎఫ్ నేత లింగమూర్తిని ఆదివారం అర్ధరాత్రి బలవంతంగా అరెస్ట్ చేసి సౌమ్య ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సైతం దీక్ష కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మరోవైపు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలో పాల్గొనేందుకోసం హైదరాబాద్కు వచ్చిన ప్రతినిధులను అరెస్టు చేసి సాయంత్రం వరకు కూడా విడిచిపెట్టలేదు. సమ్మెపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లిలో ఆర్టీసీ కార్మికులు మంత్రి కొప్పుల ఈశ్వర్ను అడ్డుకున్నారు. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ను జేఏసీ, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్బుబట్టాయి. ఈ అఫిడవిట్ టీఆర్ఎస్ కరపత్రంలా ఉందని విమర్శించాయి. మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్ను జయప్రదం చేయాలని తమ శ్రేణులకు పిలుపునిచ్చాయి. అందుకు సంబంధించిన కార్యాచరణకు రూపకల్పన చేశాయి.
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో/వనస్థలిపురం/విలేకరుల యంత్రాంగం
స్వీయ నిర్బంధంలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్షలను పోలీసులు భగం చేశారు. రెండోరోజు ఆదివారం సాయంత్రం సమయంలో భారీగా మోహరించిన పోలీసులు వారి ఇండ్లలోకి చొరబడి బలవంతంగా అరెస్ట్ చేశారు. రాజిరెడ్డి ఇంటి తలుపులు రాడ్లతో పగులగొట్టి మరీ ఆయన్ను లాక్కెళ్లారు. ఈ క్రమంలో మహిళా కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అదేవిధంగా జేఏసీ కో కన్వీనర్ లింగమూర్తి దీక్షను ఆదివారం రాత్రి 11.30 గంటలకు భగం చేసి సౌమ్య ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించడంతో వారు ప్రతిఘటించారు.
ఇందిరాపార్కు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు అనుమతివ్వకపోవడం, పోలీసులు అడ్డుకోవడంతో హస్తినాపురంలోని తన నివాసంలో శనివారం ఉదయం నుంచే అశ్వత్థామరెడ్డి గృహనిర్బంధంలో ఉన్నారు. రెండోరోజూ తన దీక్షను కొనసాగిస్తుండగా మధ్యాహ్న సమయంలో వైద్యులు చేరుకుని ఆయన పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం క్షీణిస్తున్నదనీ, వెంటనే దీక్ష విరమించాలనీ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో ఆయనను దీక్ష విరమించాలని పోలీసులు కోరినా ససేమీరా అన్నారు. మహిళ కార్మికులు కొందరు దీక్ష కొనసాగిస్తున్న హాల్లోకి వెళ్తుండగా ఇరవై మందికిపైగా పోలీసులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించారు. సెకండ్ల వ్యవధిలోనే మహిళలను ఇష్టమొచ్చినట్టు లాగేస్తూ మూడో అంతస్థు పైనుంచి అశ్వత్థామరెడ్డిని బలవంతంగా కిందకు తీసుకొచ్చారు. తోపులాట జరుగుతుండగానే ఉద్రిక్తతల నడుమ వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తనను ఎక్కడికి తరలించినా దీక్ష కొనసాగిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అశ్వత్థామరెడ్డికి సంఘీభావం తెలిపేందుకు నివాసానికి వచ్చిన మాజీ ఎంపీలు జితేందర్రెడ్డి, వివేక్లను పోలీసులు లోపలికి అనుమతించలేదు.
కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఎల్బీనగర్లోని నివాసానికి వెళ్లిన పోలీసులు ఇంటి తాళాలను రాడ్లతో పగులగొట్టారు. పెద్దపెద్ద శబ్దాలు రావడంతో కుటుంబ సభ్యులు, ఏం జరుగుతుందోనని కార్మికులు భయాందోళనకు గురయ్యారు. తలుపులు తెరిచి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. తోపులాటలు జరిగాయి. పలువురి కార్మికులను డీసీఎంలో ఎక్కించుకుని బాలాపూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. భార్యాపిల్లలను అరెస్ట్ చేశారనీ, ప్రజాస్వామ్యం ఇదేనా అంటూ రాజిరెడ్డి ఆవేదనకు గురయ్యారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారనీ, ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పాలనీ కోరారు. నేతల దీక్ష భగం చేసిన పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో భారీగా మోహరించారు. డిపోల వద్ద 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక దీక్షలు
నల్లగొండ జిల్లావ్యాప్తంగా నిరవధిక దీక్షలు కొనసాగాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంటి ఎదుట ఆర్టీసీ జేఏసీ, కార్మికులు చీపుర్లు చేతబట్టి వీధులు శుభ్రం చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కొత్తగూడెంలో దీక్షా శిబిరాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్, సీఐటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు ప్రారంభించి ప్రసంగించారు. దీక్షా శిబిరానికి వికలాంగుల సంఘం సంఘీభావం తెలిపింది. గద్వాల జిల్లా అలంపూర్లో అక్రమ అరెస్టులకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మెదక్లో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు పాల్గొన్నారు. జగిత్యాల, కరీంనగర్ జిల్లాలు సహా ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో నిరసనలు తెలిపారు. హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద సబ్బండ కులాల దీక్షకు ఎమ్మార్పీఎస్ పిలుపునివ్వగా పోలీసులు అనుమతివ్వలేదు. బయల్దేరుతున్న మందకృష్ణ మాదిగను హబ్సిగూడలో పోలీసులు అరెస్ట్ చేసి నాచారం పీఎస్కు తరలించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇందిరాపార్కు దాకా బారికేడ్లు ఏర్పాటు చేశారు.