Authorization
Mon Jan 19, 2015 06:51 pm
* తట్టిలేపిన ఐద్వా బస్సుయాత్ర
* నేడు ఇందిరాపార్కులో ముగింపు సభలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమ్మా...నా భర్త ఉన్నవన్నీ తాగితగిలేశాడు. చివరకు నా కాస్మోటిక్స్ను తాకట్టు పెట్టి తాగుతున్నాడు అంటూ బరువెక్కిన హృదయంతో ఆవేదన వ్యక్తం చేసిందామె. నా కొడుకు ఇంటివద్ద తాగితందనాలాడుతుంటే ఏదో ఒప్పించి ట్రాక్టర్ నడపమని పంపితే డీజిల్ కూడా అమ్ముకుని తాగుతున్నాడు. చెట్టంత కొడుకు చెడిపోతున్నాడు. గుడుంబాను జర బంద్ చేయించాలమ్మా అంటూ ముసలి తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. ఉదయాన్నే మంచినీళ్లతో ముఖం కడుక్కోవడం లేదు. సారాను నీళ్లలా పుక్కిలించి దాన్నే తాగుతున్నాడంటూ ఓ తల్లి ఆవేదన. ఇలాంటి హృదయవిదారకమైన అనుభవాలెన్నో ఐద్వా బస్సుయాత్ర బృందానికి వచ్చాయి. ఇలా చెప్పుకుంటూపోతే తెలంగాణాలోని పల్లెలూ, పట్టణాలు మద్యం మత్తుతో మత్కెక్కిపోయాయి. మత్తును చిత్తు చేసేందుకు ఐద్వా ఈ నెల 17 నుంచి 28 వరకు బస్సు యాత్ర చేపట్టింది. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన వచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల మీదుగా పయనించిన బస్సు యాత్ర 45 చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించింది. బస్సుయాత్ర ముగింపు సభ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద జరుగుతుంది.