Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఐక్యంగా కదలాలని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్సేన్ పిలుపునిచ్చారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టాలని కార్మికవర్గానికి సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఈనెల 28వ తేది రాత్రి విడుదల చేసిన ప్రకటనలో...కార్మిక సంఘాలు ప్రతిపాదించిన మెజారిటీ కోర్కెలకు సంబంధించి తమ ప్రభుత్వం నిర్దిష్ట హామీనిచ్చిందంటూ పేర్కొన్నారని తెలిపారు. ఆయన ప్రకటన పూర్తి అవాస్తవాలతో కూడుకుని ఉందని విమర్శించారు.
తపన్సేన్ ప్రకటన పూర్తి పాఠం...
''ఆగస్టు 26, 27 తేదీల్లో కార్మిక సంఘాలతో 12 పాయింట్ల కోర్కెలు పత్రం మీద ప్రభుత్వం రెండుసార్లు చర్చల చేసిన తర్వాత, ప్రభుత్వం తరఫున చర్చలకు నాయకత్వం వహించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 28రాత్రి ఒక ప్రకటనను పత్రికలకు పంపారు. మెజారిటీ కోర్కెల మీద ప్రభుత్వం నిర్ధిష్ట హామీనిచ్చింది. కాబట్టి ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించటానికి కార్మిక సంఘాలు ఒప్పుకున్నాయని అందులో పేర్కొన్నారు. 27న కూడా ఇటువంటి విజ్ఞాపన చేశామని చెప్పారు. ఈ రెండు కూడా పూర్తిగా అవాస్తవాలు.
వాస్తవం చెప్పాలంటే 2009 నుండి 2013 ఫిబ్రవరి వరకు తమ ప్రధాన కోర్కెల మీద కేంద్ర కార్మిక సంఘాలు 3 దేశవ్యాప్త సమ్మెలు నిర్వహించాయి. కార్మిక సంఘాలకు - మంత్రుల కమిటీకి మధ్య జరిగిన రెండు సమావేశాల్లో అస్పష్ట హామీ తప్ప నిర్ధిష్టంగా ఏమీ జరగలేదు. కొన్ని సమస్యల మీద కొన్ని చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పారు. ఆగస్టు 28న జరిగిన సమావేశంలో కోర్కెల పట్ల ప్రభుత్వ వైఖరి సానుకూలంగా వుందని, సమ్మెను వాయిదా వేయాలని బిఎంఎస్ అభిప్రాయపడింది. ఈ వైఖరితో మిగతా కార్మిక సంఘాలన్నీ విబేధించి సెప్టెంబర్ 2 సమ్మెను యధాతధంగా కొనసాగించాలని తీర్మానించారు. ప్రభుత్వం తన అబద్ధాలకు మద్దతుగా కొన్ని సమస్యలను తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఒక సూత్ర ప్రాతిపదికన ఉండి కనీస వేతనాలను తప్పనిసరిగా అమలు చేసేందుకు అనుకూలంగా సరైన చట్టం చేస్తామని చెప్పింది. ఇలాంటి ఫార్ములా ఇది వరకు ఏకగ్రీవంగా సిఫార్సు చేయబడింది. 44వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో 2012, తిరిగి 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో జూలై 2015లో ఏకగ్రీవంగా సిఫార్సు చేయబడింది. ఈ తీర్మానంలో భారత ప్రభుత్వం కూడా భాగస్వామ్యం. కానీ దీనిమీద మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. వాస్తవంలో 2012 ఎ.ఎల్.సి. లో రూ.20,000/-లు కనీస వేతనంగా సిఫార్సు చేసింది. దీన్నే 46వ లేబర్ కాన్ఫరెన్స్లో తిరిగి ఆమోదించారు. కానీ ట్రేడ్ యూనియన్ కోరుతున్న కనీస వేతనం రూ.15,000 మాత్రమే. మంత్రిగారు చెబుతున్న అస్పష్టమైన ఫార్ములా సగానికి సగం కూడా లేదు. ఈ పరిస్థితిని కార్మికవర్గం పరిగణించడానికి అర్హమైందా? కాంట్రాక్టు వర్కర్స్కు గ్యారంటీ అయిన కనీస వేతనం ఇస్తామని చెప్తుంది. కేవలం గందరగోళం సృష్టించడానికి తప్ప, వారిచ్చే హామీలు ఏమీ లేదు. ఇప్పుడు దేశంలో ఉన్న చట్టాలే కాంట్రాక్టు వర్కర్లకు కనీస వేతనాన్ని ఇవ్వాలంటూ చెబుతున్నాయి. ప్రభుత్వం వారు కాంట్రాక్టు వర్కర్లకు రంగానికి తగిన కనీస వేతనం ఇస్తామనడం వివేకవంతమైనది కాదు. కాంట్రాక్టు వర్కర్లకు ఆ పరిశ్రమలో / సంస్థలలో శాశ్వత కార్మికులకు ఇచ్చే విధంగా వేతనాలు, ఇతర సదుపాయాలు ఇవ్వాలంటూ ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. 2011లో జరిగిన 43వ లేబర్ కాన్ఫరెన్స్ ఇదే విధమైన సిఫార్సును చేసింది. 2015లో జరిగిన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కూడా ఏకగ్రీవంగా ఇదే సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చేయడంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామియే. అత్యున్నత త్రైపాక్షిక కమిటి ఏకగ్రీవంగా చేసిన ఈ సిఫార్సులను భారత ప్రభుత్వం ఎలా విస్మరిస్తుంది?
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక చట్టాల సవరణలవల్ల దేశంలోని 70% పైగా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు చట్టపరిధి నుండి బయటకి గెంటివేయబడతారు. వారికి ప్రాథమికమైన కార్మిక హక్కులు, ఇతర సదుపాయాలు ఏమీ వుండవు. ఈ చర్యలను ఇప్పటికే దుందుడుకుగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ఈ వైఖరితోనే వారు లేబర్ చట్టాల్లో మార్పులు తెచ్చారు. ప్రభుత్వం తమ త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఈ చట్ట సవరణల విషయంలో చెబుతుంది. ప్రభుత్వ చట్టసవరణల ప్రతిపాదనలు చెత్తబుట్టలో వేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాల సవరణకు ప్రెసిడెంట్ ద్వారా ఆమోదముద్ర లభించకుండా చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే జరిగిన త్రైపాక్షిక సంప్ర దింపుల్లో ఈ ప్రతిపాదనలను ట్రేడ్ యూనియన్లు అన్ని ఐక్యంగా చేసిన సలహాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. యజమానుల మెప్పు పొందేందుకు వారికి అనుకూలంగా ఉంది. ఈ కార్మిక చట్టాల్లో కనుక తిరోగమన మార్పులు వస్తే కార్మికహక్కులు, రక్షణలన్నీ రద్దు చేయబడి 70శాతానికి పైగా కార్మికులకు కార్మిక చట్టాలు వర్తించవు. దీనివల్ల కనీసవేతనం, ఇతర సదుపాయాలు ప్రభుత్వం పెంచినా, అవి కార్మికులకు వర్తించవు. కార్మికులను దాదాపుగా బానిసలుగామార్చే ఈ విధానాన్ని ఏ ట్రేడ్ యూనియనైనా అంగీకరించగలదా?
2013లో జరిగిన 45వ లేబర్ కాన్ఫరెన్స్లోనూ, తిరిగి 2015లో జరిగిన 46వ లేబర్ కాన్ఫరెన్స్లోనూ అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా, పారా టీచర్లతోపాటు ఇతరులను కార్మికులుగా గుర్తించాలని, వారికి చట్టబద్ధ హక్కులను, కనీస వేతనాలను ఇవ్వాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేసినా దానిని కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం తీవ్రమైన నేరం, మరియు ఉల్లంఘన. ఈ స్కీమ్ వర్కర్లకు బడ్జెట్లో కోతలు పెట్టడం వల్ల వారి ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఈ స్థితిలో సామాజిక భద్రతా చర్యలు తీసుకుంటామని, తగిన మార్గాలను తయారు చేస్తామని ఇచ్చే హామీలకు ఏమైనా అర్ధం ఉంటుందా? ప్రస్తుతం బోనస్ విషయంలో ఎక్కువలో ఎక్కువ రూ.10 వేల నుండి తక్కువలో తక్కువ రూ.3,500, అర్హతగా ఉన్నదాన్ని రూ.21వేల నుండి రూ.7వేలుగా మారుస్తామని ప్రభుత్వం చెబుతోంది. లాభాల మీద సీలింగ్లు లేవు కాబట్టి బోనస్ చెల్లింపులపై చట్టంలో ఉన్న సీలింగ్లన్నింటినీ ఎత్తేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. గ్రాట్యుటీలపై సీలింగ్లను తొలగించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం లేదు.
ధరలు తగ్గుతున్నాయంటూ ప్రభుత్వం చెబుతోంది, ఇది వాస్తవం కాదు. ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యావసర మరియు వినిమయ సరుకుల్లో, సేవల్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్, ఫార్వర్డ్ ట్రేడింగులను నిషేధించాలని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరింపచేసి అమలు చేయాలనే కోరికను కూడా ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ప్రభుత్వ రంగ సంస్థలు తోడ్పడుతున్నాయి. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయాలను ఆపేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. పైగా మరింత దూకుడుగా అన్ని పెద్ద పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో దేశ ఆర్థిక ప్రయోజనాలకు హాని జరిగే విధంగా వాటాల విక్రయానికి పూనుకుంటోంది. రక్షణ రంగం, రైల్వేలు, ఆర్థిక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆపేయాలనే ట్రేడ్ యూనియన్ల డిమాండ్లను ప్రభుత్వం తోసిపుచ్చింది. మరింత దూకుడుగా కీలకరంగమైన విద్యుత్, పోర్ట్ అండ్ డాక్స్, ఎయిర్పోర్టుల్లో పెద్దఎత్తున నియంత్రణలను సవరిస్తూ ప్రైవేటీకరణకు పూనుకుంటోంది.
ఇతర సమస్యలపైన ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు చాలా అస్పష్టంగాను, దాదాపుగా ఏమీ లేనట్లుగానూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఎవరైనా, ఏ ట్రేడ్ యూనియనైనా ప్రభుత్వం సమస్యల యెడల సానుకూలంగా ఉందని, కార్మికుల డిమాండ్లపై కొన్ని మెరుగుదలలు ఉన్నాయని ఎలా భావించగలరు? ఉమ్మడిగా జరుపుతున్న సమ్మె నుండి ఏ విధంగా బయటకురాగలరు? ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2 సమ్మెను జయప్రదం చేయడానికి దేశవ్యాప్తంగా కార్మికవర్గమంతా వారి యూనియన్ల అనుబంధాలతో నిమిత్తం లేకుండా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.