Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే సమ్మెలోకి..
- సన్నాహాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సంఘాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెప్టెంబరు 2న జరిగే జాతీయ పారిశ్రామిక సమ్మెకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఆయా సంస్ధల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, బాధల నేపథ్యంలో దేశవ్యాప్త సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, ఏకపక్ష చట్టాల సవరణ కారణంగా కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
ఆందోళన చెందుతున్నాయి. ఈ తరుణంలో గత రెండు, మూడు రోజులుగా ఆయా సంస్థల్లోని కార్మిక సంఘాల యూనియన్లు ప్రత్యేక సమావేశాలు నిర్ణయించాయి. జాతీయ సమ్మెకు ఇప్పటికే మద్ధతును ప్రకటించాయి. సెప్టెంబరు 2న ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించనున్నాయి. సమ్మె నేపథ్యంలో ఆయా కార్మిక సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు కింది విధంగా ఉన్నాయి.
ఐదు రోజుల పనిదినాలు
-సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి
బిహెచ్ఇఎల్ ఆర్ అండ్ డీ
బిహెచ్ఇఎల్ను రక్షించండి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి. ఆర్ అండ్ డీ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలను వారంగా పరిగణించాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
17 నెలలుగా జీతం లేదు
- శరత్బాబు, ప్రధాన కార్యదర్శి
హిందూస్థాన్ కేబుల్స్ లిమిటెడ్
హెచ్సిఎల్లో 17 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. క్లోజర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ క్యాబినేట్ సబ్కమిటీ సైతం డిసెంబరు 29, 2014న దానిని అమోదించింది. హైదరాబాద్లో దాదాపు 1600 మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. మేమంతా సమ్మెలో పాల్గొంటాం. సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందజేస్తాం.
కార్మిక చట్టాల ఏకపక్ష సవరణ
-రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి
ఇసిఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్
పనులు చేయించుకుని, బిల్లులు చెల్లించడం లేదు. కామన్వెల్త్ గేమ్స్ డబ్బులు ఇంకా రాలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను కాదని, ప్రయివేటు సంస్థలకు వర్క్ ఆర్డర్లు ఇస్తున్నారు. బకాయిలు చెల్లించడంలో తీవ్ర జాప్యం, అలక్ష్యం కనిపిస్తున్నాయి. హైదరాబాద్ యూనిట్లో మూడు వేల మంది ఉన్నాం. పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంటాం. కార్మిక చట్టాలను ఏకపక్షంగా కేంద్రం సవరిస్తోంది. వందల కోట్ల అవినీతి జరిగిందనే పేరుతో కామన్వెల్త్ గేమ్స్ పేమెంట్స్ ఆపేశారు. తద్వారా ఆయా సంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగానే సమ్మె.
కనీస వేతనం ఉండాలి
- విఠల్, ప్రధాన కార్యదర్శి
మిధాని ఉద్యోగుల యూనియన్
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ.15 వేలు ఉండాలి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఎఫ్డిఐలను అనుమతించకూడదు. రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. ప్రయివేటును ప్రొత్సహిస్తున్నారు. కేంద్రమే నష్టపరుస్తూ, నష్టం వస్తోందని అంటోంది. అందుకే సమ్మెకు పూనుకున్నాం. సక్సెస్ చేస్తాం.
చట్టాల కుదింపు సరికాదు
- సారంగపాణి, ప్రధాన కార్యదర్శి
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉద్యోగుల
ట్రేడ్ యూనియన్
కార్మిక చట్టాలను కుదిస్తున్నారు. 44 ఉంటే నాలుగు చట్టాలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాంటి ప్రతిపాదనలు ఉపసంహరించాలి. కాంట్రాక్టీకరణను రద్దు చేయాలి. ఇప్పుడున్న వారిని క్రమబద్ధీకరించాలి. పెన్షన్లు ఇవ్వాలి. ఉద్యోగ విరమణ సౌకర్యాలివ్వాలి. వర్క్ ఆర్డర్లు విదేశీ కంపెనీలకు ఇవ్వకూడదు. దేశీయ కంపెనీలను ప్రొత్సహించాలి. ఎప్పటికప్పుడు ఉద్యోగులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలి.
ధరల పెరుగుదలను అరికట్టాలి
- జానకిరాములు, ప్రధాన కార్యదర్శి
హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ కార్మిక సంఫ్ు
కంపెనీకి వర్క్ ఆర్డర్లు పెంచాలి. ఔట్సోర్సింగ్ ఉండకూడదు. జూన్లో రద్దు చేసిన కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపును పునరుద్ధరించాలి. రద్దు మూలంగా గతంలో కంపెనీకి 10 నుంచి 15 శాతం మేర వచ్చే లాభం తగ్గింది. ధరల పెరుగుదలను అరికట్టాలి. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి. టెన్యూర్ ప్రాతిపదికన చేయకూడదు. కాంట్రాక్టు వర్కర్లకు రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే సమాన వేతనాలు చెల్లించాలి.
పెట్టుబడుల ఉపసంహరణ ఆగాలి
- రమణ, ప్రధాన కార్యదర్శి
హెచ్ఎంటి ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు(సిఐటియు)
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఆగాలి. పోటీ పెరుగుతోంది. ఎక్సైజ్ డ్యూటీ అధికం చేశారు. దీన్ని తగ్గించాలి. కాంట్రాక్టీకరణ ఉండకూడదు. ఈ ఉద్యోగుల పనివేళల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇన్సెంటివ్స్ పథకాలు ఎత్తేశారు. అనధికారికంగా ఎక్కువ పనిగంటలు పనిచేయిస్తున్నారు. సమావన వేతనాలు ఉండాలి.