Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌడ్, కల్లుగీత కార్మిక సంఘల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గుడుంబాను కంట్రోల్ చేస్తామనే పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీప్ లిక్కర్ను తేవడాన్ని నిరశిస్తూ గీత కార్మికులు మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాలు పిలుపునిచ్చాయి. శనివారం బాగ్లింగంపల్లిలోని తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం, తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం, తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం, గౌడ ఐక్య సాధన సమితి, తెలంగాణ గౌడ మహాసభ, సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం, తెలంగాణ గౌడ జన్మహక్కుల పోరాట సమితి, తెలంగాణ గౌడ యువజన సంఘం, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం ఉమ్మడి సమావేశం కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ చీప్ లిక్కర్ వద్దు మహాప్రభో అంటూ మహిళలు, వృత్తిదారులు, గీత కార్మికులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించే నూతన మద్యం పాలసీ కొత్త సీసాలో పాత సారాలా ఉందని అభిప్రాపడ్డారు. చీప్ లిక్కర్ ఇప్పటికే పల్లెల్లో ఏరులైపారుతోంది ఇంకా దీని ధర తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోందని విమర్శించారు. చీప్ లిక్కర్ను తీసుకురావడం వల్ల కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పది లక్షల మందికి పైగా కార్మికులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి మద్యం పాలసీని వెనక్కుతీసుకోవాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా సెప్టెంబర్ 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని గీత కార్మికులకు పిలుపునిచ్చారు. నిరసనలు, ధర్నాలు చేసినా ప్రభుత్వం స్పందించి నూతన మద్యం పాలసీని వెనక్కుతీసుకోని పక్షంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని సంఘాల నేతలు హెచ్చరించారు.