Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని వీధులు, బస్తీలను అద్దంవలే తీర్చిదిద్దుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న సఫాయి కార్మికులకు అండగా ఉంటామని తెలంగాణ సఫాయి కార్మిక సంఘం ఛైర్మన్ మస్కు జాన్సన్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులతో సఫాయి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరాలను, పట్టణాలను సఫాయి కార్మికులు శుభ్రంగా చేస్తూ వారు అనారోగ్యాలకు గురవుతున్నారని, పని చేసే క్రమంలో ప్రమాదాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కుల, మత బేధం లేకుండా 50శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి భవనాన్ని నిర్మించి వారికి రావాల్సిన ప్రభుత్వ ఫలాలను అందేలా చూడాలని, ఔట్సోర్సింగ్ మహిళా కార్మికులకు ప్రసూతి సమయంలో ఆరు నెలల సెలవు, జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవ్వడానికి రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సఫాయి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెలుపల కృఫాదానం, జిహెచ్ఎంసి అధ్యక్షులు బాలకిషన్, దరువు అంజన్న, హమీద్ కుమార్, వెంకటేశ్వర్, మచ్చయ్య, జగన్, సంఘం లీగల్ అడ్వయిజర్ ఉసుఫ్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.