Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను చీల్చే కుట్రను తిప్పికొట్టాలి
- 'నో ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్.. సేవ్ కాన్స్ట్యూషన్'లో వక్తలు
నవతెలంగాణ - సిటీబ్యూరో
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని వక్తలు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేక మతాల పేరుతో, కులాల పేరుతో ఉద్దేశపూర్వకంగానే చీల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద 'నో ఎన్నార్సీ, నో సీఏఏ, నో ఎన్పీఆర్.. సేవ్ కాన్స్ట్యూషన'్ నినాదాలతో ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందూ మతోన్మాదుల నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ మహిళలు భావాలను ముగ్గుల రూపంలో వ్యక్తం చేశారు. కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నరసింహారావు, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర నాయకులు డాక్టర్ సుధాకర్, సీపీఐ(ఎంఎల్-న్యూడెమోక్రసీ) రాష్ట్ర నాయకులు సంధ్య, రమ, ఐఎఫ్టీయూ నాయకులు హన్మేష్, అనురాధ, ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి అరుణజ్యోతి, హైదరాబాద్ జిందాబాద్ నగర నాయకులు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు.. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ పేరుతో దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కుటిల రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.