Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదాలో 9 మంది మృతి
నవతెలంగాణ-మణుగూరు/ పెనుబల్లి/ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
పండుగ పూట కుటుంబాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ద్విచక్ర వాహనాలు ఢీ కొని ముగ్గురు యువకులు చనిపోయారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో కారు అదుపుతప్పి తాతామనుమడు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని గోపాలరావుపేటకు చెందిన వంగర శంకర్రావు(23) పని నిమిత్తం మణుగూరు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఇదే క్రమంలో మణుగూరు మున్సిపాల్టీలోని సుందరయ్యనగర్కు చెందిన షేక్ ఇస్మాయిల్(17), రాజుపేటకు చెందిన పల్లెపు కుమారస్వామి(18) విజయనగరం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని ఇసుకబంకర్ వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ముగ్గురూ మృతిచెందినట్టు ఎస్హెచ్ఓ ఎంఎ.షుకూర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన సూరిరెడ్డి(66) తన కుమారులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లతో కలిసి కర్నాటక రాష్ట్రంలో తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. తిరిగి రాజమండ్రి వెళ్లేందుకు కారులో హైదరాబాద్ మీదుగా బయల్దేరారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర సమీపంలోని లంకపల్లి వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడు పక్కనున్న స్థూపాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో సూరిరెడ్డితో పాటు మనుముడు హేమంత్రెడ్డి(8) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరగ్గానే ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ముందు సీట్లల్లో కూర్చున్న మిగతా వారు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన మోహన్ కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, గాయత్రి, రోహిత్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను సత్తుపల్లి ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వరంపల్లి శివారులో దాబాలో పని చేసే జుక్కల్ మండలానికి చెందిన వాగ్మారే రాజు(21) మంగళవారం రాత్రి 44వ జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నిజాంసాగర్ మండలం కల్హేర్ మండలం మాసన్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి బాలయ్య(44) అనారోగ్యానికి గురైన కొడుకును బుధవారం బైక్పై మండల కేంద్రంలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకొ చ్చాడు. తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ఢ కొట్టడంతో బాలయ్య తీవ్రంగా గాయ పడి చనిపోయాడు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలంలోని కొలమద్ది గ్రామానికి చెందిన గుండెల్లి రాజు(28) స్నేహితుడితో కలిసి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్కు కల్లు తాగేందుకు పోయారు. తిరుగు ప్రయాణంలో బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా అదుపుతప్పి కల్వర్టును ఢీ కొనడంతో రాజు మృతిచెందాడు. నవీపేట్ మండలం యంచ శివారులో రైస్మిల్లులో గుమస్తాగా పని చేసే జానకిరామ్.. తన కుమారుడు జాదవ్ శివసాయి(17)తో కలిసి బైక్పై నందిగామ వెళ్తుండగా డీసీఎం ఢీ కొది. దీంతో శివసాయి ప్రాణం కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన జానకిరామ్ను ఆస్పత్రిలో చేర్చారు.