Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 69మంది టీఆర్ఎస్, ముగ్గురు ఎంఐఎం
- రాష్ట్ర ఎన్నికల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 72 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 69 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు కాగా మిగిలిన ముగ్గురు టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎంకు చెందినవారున్నారు. ఆ ముగ్గురు భైంసా మున్సిపాల్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఇక టీఆర్ఎస్ ఏకగ్రీవాలు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా చూస్తే బాన్సువాడ (1), భీంగల్ (1), భూపాలపల్లి (1), బోధన్ (1), బొల్లారం (3), చిట్యాల (2), డోర్నకల్ (1), దుబ్బాక (1), దుండిగల్ (2), హుస్నాబాద్ (2), ఇబ్రహీంపట్నం (2), జవహర్ నగర్ (1), కోరుట్ల (3), కొస్గి (1), మహబూబ్నగర్ (1), మహబూబాబాద్ (1), మరిపెడ (2), మెదక్ (2),
మెట్పల్లి (1), నాగారం (1), నిర్మల్ (2), పరకాల (11), పెద్దపల్లి (2), పోచంపల్లి (1), పోచారం (2), సదాశివ్ పేట్ (1), సత్తుపల్లి (6), శంకర్పల్లి (1), సిరిసిల్ల (4), సూర్యాపేట్ (1), తొర్రూర్ (2), వేములవాడ (1), వికారాబాద్ (2), వనపర్తి (2) వైరా(1) ఉన్నాయి. రాష్ట్రంలో 120 మున్సిపాల్టీలు, తొమ్మిది కార్పొరేషన్లలో 3052 వార్డుల్లో ఈ నెల 22న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 72 మంది ఏకగ్రీవం కావడంతో ఇక మిగిలిన 2980 వార్డులకు పార్టీల మధ్య పోటీ నెలకొంది. పార్టీల వారీగా అధికార టీఆర్ఎస్ నుంచి ఎక్కువగా 2972 మంది నామినేషన్లు వేయగా ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి 2616 మంది, బీజేపీ నుంచి 2313 మంది బరిలో నిలిచారు. ఇక వామపక్ష పార్టీలు సీపీఐ(ఎం) 166 మందిని పోటీలో నిలపగా, సీపీఐ అభ్యర్థులు 177 స్థానాల్లో ఉన్నారు. టీడీపీ నుంచి 347 మంది, ఎంఐఎంకు చెందిన 276 మంది, ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న పార్టీల నుంచి 281 మంది, ఇండిపెండెండ్లు 3750తో కలుపుకొని మొత్తం 12898 మంది రంగంలో ఉన్నారు.నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 వార్డులకు గాను అత్యధికంగా 415 మంది పోటీ పడుతున్నారు. అతి తక్కువగా వడ్డెపల్లి మున్సిపాల్టీలో 10 వార్డులకు కేవలం 29 మంది బరిలో నిలిచారు.