Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ ముట్టడిలో జీపీ కార్మికులు
- రెండు గంటల పాటు బైటాయింపు
- పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి.. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
- లక్షలజీతాలు మీకు..కార్మికులకు పస్తులా?
- రూ.8,500 వేతనం ఇవ్వాలి.. లేకుంటే ఫిబ్రవరి 17 తర్వాత మరో ఉద్యమం : పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సర్పంచులు, అధికార పార్టీ నేతల బెదిరిం పులు.. వచ్చే దారిలో పోలీసుల అడ్డగింతలు.. గుచ్చిగుచ్చి ప్రశ్నించటాలు.. ఇవేమీ జీతాలు రాక కడుపులు మాడ్చుకుంటున్న పంచాయతీ కార్మికులను అడ్డుకోలేక పోయాయి. ఇస్తున్నదే రూ.8,500 అరకొర వేతనం.. అదీ నాలుగు నెలలుగా పెండింగ్లో పెట్టడాన్ని నిరసిస్తూ పండుగ వేళా వేలాదిగా పట్నం తరలివచ్చారు. గ్రామ పంచా యతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూని యన్ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిం చారు. రెండు గంటల పాటు గేటు ముందు రోడ్డుపై బైటాయించారు. 'రూ.8,500 వేతనం ఇవ్వాలి...మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి...మీకు లక్షల జీతాలు...మాకు పస్తులా? ఇదేమి న్యాయం...ఇదేమి న్యాయం...' అంటూ పెద్దపెట్టున నినదించారు. పోలీసులు గ్రామ పంచాయతీ కార్మికుల తరఫున ఐదుగురు ప్రతినిధులను కమిషనర్ రఘునందన్ రావు దగ్గరకు తీసుకెళ్లారు. కార్మికుల సమస్యలను వారు వివరించారు. దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ..రూ.8,500 బ్యాంకుల ద్వారా ఇచ్చే ఏర్పాట్లను పరిశీలిస్తామనీ, అక్రమ తొలగింపులను అడ్డుకుంటామనీ, బాండ్ పేపర్ విధానాన్ని తొలగించే అంశాన్ని పునరాలోచిస్తామని హామీనిచ్చారు. కారోబార్, బిల్ కలెక్టర్, పంప్ ఆపరేటర్, అటెండర్, వాటర్ మ్యాన్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, వాచ్మెన్, కంప్యూటర్ ఆపరేటర్, శానిటరీ వర్కర్ల కేటగిరీలను యధాతథంగా కొనసాగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. ఏ పద్దు నుంచి చెల్లించాలో స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. ఇక నుంచి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ పథకం ప్రీమియం రూ.968లు ప్రభుత్వమే చెల్లిస్తుందని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం జరిగే డీపీఓల సమావేశంలో చర్చిస్తామని భరోసానిచ్చారు.
ముట్టడినుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు, సీఎం...పంచాయతీ కార్మికులకు నాలుగైదు నెలలుగా జీతాలివ్వకుండా ఇబ్బందులు పెట్టడం దారుణమని విమర్శించారు. వేతనాల పెంపు హామీ కోసం ఒక పోరాటం, హామీ నిలబెట్టుకోవాలని, జీఓ జారీ చేయాలని ఇంకో పోరాటం, జీఓ అమలు కోసం మరో పోరాటం చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో దాపురించిందన్నారు. కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో రోజు కూలి రూ.600 ఇస్తుంటే ఇక్కడ నెలకు రూ.8,500 ఇస్తామన్న హామీని కూడా ఎందుకు బుట్టదాఖలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వెంటనే పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం చెల్లించాలనీ, జీఓ నెంబర్ 51ని సవరించాలనీ, మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీల్లో అదనపు సిబ్బంది పేరుతో కార్మికులను తొలగించడాన్ని ఆపాలనీ, ఏడాదిపాటు పనిచేస్తామని ఒప్పందాలు రాయించుకోవటాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. నెల రోజుల్లోగా అందరికీ వేతనాలు చెల్లించకపోతే, సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 17 తరువాత మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ...జీతాలు పెంచామని ఆశపెట్టి పల్లెప్రగతి రెండు విడతల్లో పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుని జీతాలు చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. పంచాయతీ కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు పైళ్ల గణపతిరెడ్డి మాట్లాడుతూ...గతంలో పంచాయతీ కార్మికుల కోసం జనశ్రీ బీమా పథకం ఉండేదనీ, నేడు దానిని అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. మల్టీపర్పస్ పేరుతో పదిరకాల పనులను ఒకే వ్యక్తి చేయించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పెన్ను పట్టి పనిచేసే బిల్కలెక్టర్లను చీపురు పట్టి ఊద్చాలనటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ కోశాధికారి పోలే సాంబయ్య, ఉపాధ్యక్షులు ఈశ్వర్, యాదమ్మ, స్వప్న, మాధవి, రాజ లింగు, మల్లవ్వ, మహేష్, కార్యదర్శులు జి.పాండు, శంకర్, కొక్కోండు, దశరథ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.