Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ని నగరాలను స్మార్ట్సిటీలుగా మార్చారు?
- డబుల్ బెడ్ రూంలు చూస్తారా? : బీజేపీకి కేటీఆర్ సవాల్
- స్థానికంగా ఏమీ చేయలేకే జాతీయ అంశాల ప్రస్తావన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్పై ఆరోపణలు చేసే ముందు బీజేపీ ఎన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చిందో చెప్పాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణభవన్లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇండ్ల నిర్మాణానికి సంబం ధించి కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడు తున్నారనీ, దేశంలో అన్ని రాష్ట్రాలు చేపట్టిన ఇండ్ల నిర్మాణం కన్నా, ఒక్క తెలంగాణ ఎక్కువ చేపట్టిందని గుర్తు చేశారు. కిషన్రెడ్డి తనతో వస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు చూపించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. స్థానికంగా చేసిందేమి లేకనే బీజేపీ పౌరసత్వం సవరణ చట్టం లాంటి జాతీయ అంశాలను మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నదని విమర్శించారు. చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సినవే తప్ప బీజేపీ తెలంగాణకు అదనంగా చేసిందేమి లేదని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఒకటే ట్యాంక్బండ్ ఉండేదనీ, ప్రస్తుతం 90 ఉన్నాయనీ, అలాగే 25 అర్బన్ లాన్స్ స్పేసెస్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎదురు డబ్బులు ఇస్తామన్నా అభ్యర్థులు దొరకని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతూ..టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారీ పొత్తుతో ముందుకెళ్లాయని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లు, వేములవాడ, నారాయణ్పేట్ మున్సిపాల్టీలు సహా 15 పట్టణాల్లో ఇలాంటి అవగాహన చేసుకున్నారనీ, ఇరు పార్టీల అభ్యర్థులు లేని చోట టీఆర్ఎస్ రెబెల్స్కు మద్దతు తెలుపుతున్నారన్నారు. టీఆర్ఎస్ రెబెల్స్ సమస్య 90 శాతం పరిష్కారమైందనీ, కొల్హాపూర్లో రెబెల్స్ కూడా దారికొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో కొత్త, పాత నేతలంటూ ఉండరనీ, ఒకసారి పార్టీలోకి వచ్చిన వారంతా పార్టీవారేనని గుర్తు చేశారు. ఉద్యోగులు పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ వైపే ఉన్నారనీ, ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే పార్టీగా టీఆర్ఎస్ వారి మనస్సులను గెలుచుకుందని తెలిపారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి టికెట్లను అమ్ముకున్నారని వస్తున్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్, ఎన్నికల్లో టికెట్లు రాని వారు ఇలాంటి అభాండాలు వేయడం సాధారణంగా ఉండేదేనని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మున్సిపల్ మ్యానిఫెస్టోలో పెట్టడంపై కేటీఆర్ స్పందించారు. మేం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం. ఏమవుతుందని వ్యాఖ్యానించారు. స్థానిక సమస్యలపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదనీ, అందుకే ఇప్పటికే అమలవుతున్న రూ.ఐదుకే భోజనం, చెరువుల సుందరీకరణ తదితర విషయాలను హామీలుగా ఇచ్చిందన్నారు. వచ్చే నెల నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రజాదర్భార్ నిర్వహించాలనుకుంటున్న విషయం తనకు తెలియదని కేటీఆర్ చెప్పారు. తెలియని విషయాలపై వ్యాఖ్యానించనని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నాయకులకు, రాజ్యాంగసంస్థలకు హక్కులున్నాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఒకే రకమైన సమస్యలు లేవనీ, అందుకే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వారీగా ప్రత్యేకంగా మేనిఫెస్టోలు విడుదల చేయాలని స్థానిక నాయకులను ఆదేశించినట్టు చెప్పారు. నూతన మున్సిపల్ చట్టంపై ఫిబ్రవరి, మార్చిలో శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన పాలకమండళ్లను ఇందులో భాగస్వాములను చేస్తామని తెలిపారు.
ఆ ప్రస్తావనేలేదు...
సీఎం పదవికి సంబంధించి టీఆర్ఎస్ నాయకులెవరూ ప్రస్తావనే తేవడం లేదు. దక్షత కలిగిన టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఈ విషయంపై అసెంబ్లీలోనే స్పష్టత నిచ్చారు. ప్రతిపక్షాల దగ్గర విషయం లేదు. మీడియాకు మసాలా దొరకడం లేదు. మీడియానే ఒకటికి, రెండు సార్లు అడిగి రాస్తున్నది. తాను కొత్త మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంపైనే దృష్టి సారించాననీ చెప్పారు. వికేంద్రీకరణ ప్రజలకు మెరుగైన పాలననందిస్తుందనీ, జీహెచ్ఎంసీ విభజన చేయాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. టోక్యో గ్రేటర్ మున్సిపాల్టీ విషయంలో కొన్ని వార్డులకు స్వయం పాలనాధికారం ఉంటుందని తెలిపారు. కొత్త జిల్లాలు, మండలాలు, తండాలు గ్రామాలుగా మారిన తర్వాత ప్రజలకు దూరభారం తగ్గిందని చెప్పారు.