Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు
- సోదాల అనంతరం గజ్వేల్కు తరలింపు
- తమ ముందు హాజరు పర్చాలన్న హైకోర్టు
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.కాశీంను గజ్వేల్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయమే పోలీసులు హైదరాబాద్ ఓయూలోని ప్రొఫెసర్ ఇంటికి చేరుకున్నారు. తలుపులు తీయకపో వడంతో పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. విరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన కాశీంకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఉదయం నుంచి ఆయన ఇంట్లో
గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు ఐదు గంటలు సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాశీంపై 2016లో సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ కాశీంను ఏ-2గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. ఐదేండ్ల కిందట ఇదే కేసులో కాశీం ఇంట్లో సోదాలు చేసి మావోయిస్టు కరపత్రాలు, సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి సెర్చ్ వారెంట్తో కాశీం ఇంట్లో సోదాలు చేపట్టిన పోలీసులు అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని గజ్వేల్కు తరలించారు. కాశీం ఇంట్లో పోలీసుల సోదాలను విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఎన్ఆర్హెచ్ హాస్టల్ నుంచి ఓయూలోని కాశీం నివాసానికి వెళ్లిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాశీం అరెస్టును తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్ జిల్లా కమిటీతోపాటు పలు విద్యార్థి సంఘా లు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామికవాదులు, రచయితలతోపాటు ప్రతి ఒక్కరూ అక్రమ అరెస్టులను ఖండించాలని కోరారు. యూనివర్శిటీ నిబంధనలకు విరుద్దంగా ప్రొఫెసర్ కాశీంను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఓయూ ప్రొఫెసర్లు, పీడీఎస్యూ నేతలు నిరసన తెలిపారు.
అక్రమంగా అరెస్టు చేశారు..
తన భర్త కాశీంను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, అరెస్టును ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని ఆయన భార్య స్నేహలత కోరారు. ఐదేండ్ల కిందటి కేసులో శనివారం గజ్వేల్ పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016లో అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. తన భర్త ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఉదయమే ఇంటికి చేరుకున్న పోలీసులు గడ్డపారతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారని తెలిపారు. ఇంట్లోని వస్తువులను చిందరవందరగా చేసి తనిఖీ చేశారన్నారు. కొన్ని పుస్తకాలతోపాటు, కంప్యూటర్ హార్డ్డిస్క్ తీసుకెళ్లారని తెలిపారు. పోలీసుల తీరు భయాందోళనకు గురిచేసిందని, అక్రమ అరెస్టుపై హైకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు.