Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజా ఉద్యమాలు:
ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి వెంకట్
- 1982 నాటి ఉద్యమ స్ఫూర్తితో నేడు కార్మిక, కర్షకుల ఆందోళనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మతం, జాతి పేరుతో బీజేపీ దేశంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఈనెల 19న(ఆదివారం) కార్మిక, కర్షక ఐక్యతాదినంగా జరపాలని కోరుతూ శనివారం ఎస్వీకేలో రాష్ట్ర సదస్సు జరిగింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగిన సదస్సులో వెంకట్ మాట్లాడుతూ దేశాన్ని ఐక్యంగా ఉంచుతున్న రాజ్యాంగాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రులు పన్నుతున్నదని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కాలరాస్తూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ, ప్రజలపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. 1982 జనవరి 19న ఆనాడు కార్మిక కర్షకుల హక్కుల కోసం తమిళనాడులోని నాగపట్నంలో పెద్దఎత్తున ఐక్యపోరాటం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యవసాయ కార్మికులతో పాటు 10 మంది మృతి చెందారనీ, వారి పోరాటాన్ని ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లేందుకు నేడు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేయాలని పిలుపు నిచ్చారు. అఖిల భారత కిసాన్సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ 38 ఏండ్ల కింద జరిగిన ఆందోళనలో మృతి చెందిన అమరుల త్యాగాలనుంచి నేటి తరం స్ఫూర్తి పొంది బలమైన కార్మిక, కర్షక ఉద్యమాలు నిర్మించాలని సూచించారు. ఒక్కరుగా కాకుండా ఐక్యంగా పోరాడినప్పుడే పాలక వర్గాలు దిగొస్తాయన్నారు. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ను బలవంతంగా అమలు చేయాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తూనే, కేంద్ర నిర్ణయాలకు దొడ్డిదారిన టీఆర్ఎస్ మద్దతిస్తున్నదని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు మాట్లాడుతూ దేశంలో కార్మికులు, కర్షకుల హక్కులపై పాలక పక్షాలు చేస్తున్న దాడి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 23న నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి, 26న స్వాతంత్ర దినోత్సవం, 30న గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. టార్చిలైట్ ర్యాలీలు, ధర్నాలు, వినతి పత్రాలు సమర్పించి తమ నిరసనను తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, కార్యదర్శి జె.వెంకటేష్, కోశాధికారి వంగూరి రాములు, తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జంగారెడ్డి, టి.సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు, తెలంగాణ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.ధర్మనాయక్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మూడ్ శోభన్, మాదినేని లక్ష్మి, భాగ్యలక్ష్మి, సీఐటియూ రాష్ట్ర నాయకులు పి రాజరావు, కాటం రాజు, జయలక్ష్మి,, రమ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బొప్పని పద్మ, ఆర్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.