Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'డబుల్' పూర్తి కాలే..
- భగీరథ పంపులు నీళ్లియ్యట్లే...
- మున్సిపోల్స్లో వందకు వందశాతం గెలుపు సాధ్యమేనా...?
- గులాబీ శ్రేణుల్లో అంతర్మథనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. వందకు వందశాతం మున్సిపాల్టీలన్నింటిలో గెలుపు మనదే...' టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలివి. కానీ వందకు వందశాతం ఆయన మాటలు నిజమవుతాయా..? అనే గుబులు ఇప్పుడు గులాబీ శ్రేణులకు పట్టుకున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబు తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పటికీ అనేక పురపాలక సంఘాల్లో పూర్తి కాలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ వాటిని లబ్దిదారులకు అందజేయలేదు. మరోవైపు మల్లన్నసాగర్ ముంపు బాధితులకు వాటిని కేటాయిస్తామంటూ చెప్పినప్పటికీ అదీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పీసీసీ చీఫ్ సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపొందిన సంగతి విదితమే. ఇటీవలే ఏర్పడిన ఈ మున్సిపాల్టీలో కూడా డబుల్ బెడ్రూంల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టిన దాఖలాల్లేవని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇదే రకమైన పరిస్థితి రాష్ట్రంలోని అనేక పురపాలక సంఘాల్లో నెలకొన్నది. ఇది మున్సిపోల్స్పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరోవైపు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తామన్న ప్రభుత్వ హామీ అనేక మున్సిపాల్టీల్లో సాకారం కాలేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయం కంటే ముందే సీఎం కేసీఆర్... 'ఇంటింటికీ నల్లా నీళ్లియ్యకపోతే ఓట్లడగ...' అని ప్రకటించారు. కానీ ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరుసగా వచ్చాయి. ఇవన్నీ పూర్తయినా మిషన్ భగీరథ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక నగరాలు, పట్టణాల్లో పైపు లైన్లు వేసే దశలోనే ఈ కార్యక్రమం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇటు డబుల్ బెడ్ రూం ఇండ్లు, అటు భగీరథ... మున్సిపోల్స్పై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. జీహెచ్ఎమ్సీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ మినహా దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఈ రెండింటి ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.
రెబెల్స్పై వ్యూహాత్మక మౌనం...
ఈ పరిణామాల నేపథ్యంలోనే టీఆర్ఎస్ పెద్దలు.. రెబెల్స్పై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని సమాచారం. ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్లాంటి పథకాలు పురపాలిక ఎన్నికల్లో గట్టెక్కిస్తాయనే ధీమా ఉన్నప్పటికీ... డబుల్, భగీరథ కొంత ఇబ్బంది పెడతాయనే ఆందోళన వారిని వెంటాడుతున్నది. ఈ క్రమంలో వేరే పార్టీలకు మున్సిపోల్స్లో కొంత పట్టు చిక్కే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు తమ పార్టీ నుంచి రెబెల్స్గా పోటీ చేసే వారిపై ఇప్పటికిప్పుడు వేటేయటం ద్వారా అలాంటి వారిని కూడా దూరం చేసుకోవటం మంచిది కాదని వారు భావిస్తున్నారు. ఇది పార్టీకి కొంత నష్టం చేకూరుస్తుందని యోచిస్తున్నారు. ఒకవేళ అదే తిరుగుబాటు అభ్యర్థులు కౌన్సిలర్లుగానూ, చైర్పర్సన్లుగానూ గెలుపొందితే వారిని నయానో, భయానో నచ్చజెప్పి తిరిగి తమ గూటికి చేర్చుకోవచ్చనే అంచనాతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. అందువల్లే సూర్యాపేటలాంటి ఒకట్రెండు చోట్ల తప్ప.. మిగతా మున్సిపాల్టీల్లో ఎక్కడా సస్పెన్షన్ల జోలికెళ్లకుండా ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని తెలిసింది. కొల్హాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వేరే పార్టీ అభ్యర్థులకు బహిరంగంగానే మద్దతిచ్చి, వారి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా కేసీఆర్ వైపు నుంచిగానీ, కేటీఆర్ వైపు నుంచిగానీ ఎలాంటి హెచ్చరికా వెలువడకపోవటం గమనార్హం.