Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోషకాల నెలవు, ఔషధాల గని
- తాటిబెల్లంతో స్వీట్లు
- ఉత్పత్తి పెరిగితే పరిశ్రమల అభివృద్ధి
- యువత, మహిళలకు ఉపాధి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా.. మర్యాద చేసేది కల్లుతోనే. ఒకప్పుడు పేరు పలకడానికే ఇబ్బందిపడేవాళ్లు. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆ బిడియం పోయింది. అందులోని ఔషధ గుణాలు తెలిసొచ్చాయి. కల్లును మించిన సహజసిద్ధ పానీయం నీరా. పోషకాలు అందించడంలోనే కాదు... ఎన్నో రకాల జబ్బులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సేకరణలో మెళకువలు నేర్పి, శీతల పానీయంగా వృద్ధి చేయగలిగితే... కార్మికులకు భరోసా, యువతకు ఉపాధి కలిగే అవకాశాలు అధికం. అలాంటి నీరా ఉత్పత్తిని పెంచడానికి, పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తగినంత ప్రోత్సాహమివ్వాలని కల్లుగీత కార్మికసంఘాలు కోరుతున్నాయి.
అసలు నీరా అంటే..
కల్లు అయితే.. సాయంత్రం చెట్టుకు లొట్టి కట్టి, ఉదయమే గీస్తారు. నీరా అలా కాదు. చెట్టుకు కట్టే ముంతను శుభ్రం చేస్తారు. ఎండ సోకకముందే చెట్టునుంచి తీస్తారు. ఉదయం ఐదులోపే సేకరించిన నీరాను ఫ్రిజ్లో ఉంచితే రంగు, రుచి కోల్పోకుండా రెండు రోజులు నిల్వ ఉంటుంది. కొబ్బరి నీళ్లకంటే శ్రేష్టమైన పానీయం. నీరాలో మత్తు ఉండదు. పెద్దలనుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ తాగగలిగే డ్రింక్. నీరాను మరగబెట్టి తాటి సిరప్ను, దానినుంచి బెల్లాన్ని తయారు చేస్తారు. బెల్లాన్ని అన్ని రకాల స్వీట్ల తయారీలో ఉపయోగించొచ్చు. ఈ సిరప్, బెల్లంలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయని, ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో దీని ప్రాముఖ్యత ఉందని పలువురు ఆయుర్వేద వైద్యులు అభిప్రాయపడ్డారు.
నీరాలో పోషకాలు:
ప్రతి 100 మిల్లిలీటర్ల నీరాలో ప్రొటీన్, పిండిపదార్థం, లవణాలు, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, సోడియం, పొటాషియం ఉంటాయి. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు దూరంచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని మినరల్స్ రక్తకణాలను వృద్ధి చేస్తాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. కాలేయ, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదని పలువురు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లను రాకుండా నివారిస్తుంది. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.
అధ్యయన కమిటీ వేసిన సర్కారు...
వీటిని గుర్తించిన వివిధ రాష్ట్రాలు, నీరాను, దాని ఉత్పత్తుల కోసం ఇండిస్టీనే సృష్టించాయి. కేరళలోని కాసరగఢ్, పుణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, ఆంధ్రప్రదేశ్లోని పందిరిమామిడిలో ఉన్న డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం.. నీరాను నిల్వ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ ఆలోచన చేసింది. నీరా సేకరణ, అమ్మకాలకోసం జీవోను తెచ్చింది. హైదరాబాద్లోని నెక్లెస్రోడ్లో స్టాల్ పెట్టే యోచనలో ఉంది.
పరిశ్రమకోసం శ్రమ పెరగాలి...
రాష్ట్రంలో 8వేల గ్రామాల్లో 2.17లక్షల మంది కల్లుగీత కార్మికులున్నారు. ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాయి. కారణాలేమైనా వృత్తి వదిలి వలసలు వెళ్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది. ఈ వలసలను ఆపాలంటే, వారికి ఉపాధి కల్పించాలంటే ఒక స్టాల్ సరిపోదు. ఇతర రాష్ట్రాల్లోలాగే పరిశ్రమను నెలకొల్పాలని కల్లుగీత కార్మిక సంఘాల నేతలు తెలిపారు. నీరా నిల్వకాలం పెంచి, ఎనర్జీ డ్రింక్గా విక్రయించాలి. అలాగే తాటి బెల్లం సిరప్, బెల్లం తయారీకి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలి. తాటాకులు, ఈతాకుల నుంచి బుట్టలు, విసనకర్రలు, పిల్లల కోసం బొమ్మలు, రకరకాల అలంకరణ వస్తువులను తయారు చేసే కుటీర పరిశ్రమలు ఏర్పడతాయి. ఈ రెండు పరిశ్రమలవల్ల యువత, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. అందుకే అధ్యయన, అమలు వేగం పెంచాలని, ఆయా రంగాల్లో యువతకు రాష్ట్ర, క్షేత్రస్థాయిల్లో శిక్షణ ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వం భరోసా ఇవ్వాలి..
ప్రభుత్వ నివేదికలతోనే సరిపుచ్చ కుండా నీరా ఉత్పత్తికి సహకరించాలి. మన రాష్ట్రంలో చాలా సొసైటీలు ఉన్నయి. అవి నీరా ఉత్పత్తికో, తాటిబెల్లం తయారీకో ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. అంత భరించే శక్తి కల్లుగీత కార్మికులకు లేదు. ప్రభుత్వం రుణాలివ్వాలి. ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. కార్పొరేట్ సంస్థల కూల్డ్రింక్స్ పోటీని తట్టుకోవాలంటే... ప్రభుత్వం నీరా గురించి విస్తృతమైన ప్రచారం చేయాలి.
- ఎం.వి.రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
కల్లుగీత కార్మిక సంఘం
ఉపాధి పెరుగుతుంది
రత్నవరంలో 15 మందిమి నీరా తీస్తున్నం. రోజుకు 200 నుంచి 300 లీటర్లు వస్తుంది. నీరాను ఉడికించి తాటిబెల్లం పాకం తీస్తున్నాం. కోయంబ త్తూర్, మద్రాసు, కేరళలో సిరప్ తయారీకి ప్రత్యామ్నాయ పరికరాలున్నాయి. అవన్నీ అందుబాటు లోకి వస్తే బాగుంటుంది. నీరా, సంబంధిత ఉత్పత్తుల విక్రయాలు పెరిగితే ఉపాధి పెరుగుతుంది.
- బెల్లంకొండ వెంకటేశ్వర్లు,
కేజీకేఎస్, నీరా విభాగం రాష్ట్ర కన్వీనర్
అవగాహన పెరగాలి..
నీరాను సాఫ్ట్ డ్రింక్గా ప్రమోట్ చేయాలని ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తున్నది. ఎమరాల్డ్ వాళ్లతో కలిసి, తాటిబెల్లంపాకంతో అరిశెలు, పల్లీపట్టీలు, డ్రైఫ్రూట్ లడ్డూ వంటివి తయారు చేసినం. నీరా సాఫ్ట్ డ్రింక్గా అభివృద్ది కావాలన్నా, స్వీట్ల ఇండిస్టీ ఏర్పడాలన్నా... ఇంకా ఆదరణ పెరగాలి.
- మద్దెల రమేష్బాబుగౌడ్, అధ్యక్షులు, తెలంగాణ నీరా, పల్మిర ప్రొడ్యూసర్స్ డెవలప్మెంట్ సొసైటీ.