Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20వేల మంది రైతుల ఖాతాల్లో జమకాని ధాన్యం డబ్బులు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.280కోట్లు పెండింగ్
- పంట కొనుగోలు కేంద్రాలన్నీ దాదాపు పూర్తి
- యాసంగి పెట్టుబడికి అన్నదాతలకు తీవ్ర ఇబ్బందులు
నవతెలంగాణ-కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్లో అమ్మిన ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులు దాదాపు 20వేల మంది ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం ఏకంగా రూ.280 కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. అసలే అరకొరగా వచ్చిన ధాన్యం అమ్మితే, ఆ డబ్బులు చేతికిరాక యాసంగి
పెట్టుబడి కోసం ప్రయివేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐకేపీి, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం1031 కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం లక్షా 76వేలా800మంది రైతుల నుంచి 11లక్షలా 28వేలా 360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సేకరించింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు దాదాపు పూర్తయ్యాయి. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో దాదాపు కేంద్రాలన్నీ మూసివేశారు. కానీ రెండ్రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు.
భారీ మొత్తంతో పెండింగ్
జిల్లాలవారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు రూ.477 కోట్లా 72లక్షలు సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 8,461 మంది రైతులకు రూ.56కోట్లా 7లక్షలు ఇవ్వాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో రూ.376 కోట్లా 54లక్షలు రైతుల ఖతాలో వేయగా ఇంకా 7,169 మందికి రూ.87కోట్లా76లక్షలా 20వేలు చెల్లించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.250కోట్లా 77 లక్షలు రైతులకు చెల్లించగా రూ.58కోట్లా 8లక్షలు పెండింగ్లో ఉంది. జగిత్యాల జిల్లాలో రూ.645కోట్లా25 లక్షలు రైతుల ఖాతాలో వేశారు. 3,966 మంది రైతులకు రూ.77 కోట్లా 55లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా ఈ నాలుగు జిల్లాల్లో కలిపి 280 కోట్లు పెండింగ్లో ఉన్నది.
ఆన్లైన్ నమోదులోనూ జాప్యమే..
పౌరసరరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలోనే ధాన్యం డబ్బుల కోసం రైతులు నెలరోజులుగా ఎదురుచూసు ్తన్నారు. అక్టోబర్ నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాగా వర్షాలతో కొంత జాప్యం జరిగింది. నవంబర్ నుంచి డిసెంబర్ మొదటివారంలోనే వేగవంతమైన కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. అయినా కొందరు రైతుల ఖాతాలో డబ్బులు పడలేదు. ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రాల నిర్వాహకులు, అధికారులు రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో ఆలస్యం చేశారు. అధికారులు సాంకేతిక కారణాలు చెబుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగానే రైతులకు డబ్బులందడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే యాసంగి పనులు ప్రారంభమవగా పెట్టుబడికి ధాన్యం అమ్మిన డబ్బులు రాక అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు.
జిల్లా కొనుగోలు రైతులు సేకరించిన ధాన్యం
కేంద్రాలు (మెట్రిక్ టన్నులలో)
కరీంనగర్ 243 60,541 2,90,240
పెద్దపల్లి 217 44,767 2,53,723
సిరిసిల్ల 182 35,083 1,73,760
జగిత్యాల 371 36,409 4,10,637
మొత్తం 1031 1,76,800 11,28,360
'వడ్లు అమ్మి నెల అయితాంది. రెండురోజుల్ల పైసలు బ్యాంకుల ఏస్తనన్నరు. నెల అయితాన్నా పత్తా లేవు. ఎనిమిదెకరాల్లో వరి ఏస్తే 175 బస్తాల వడ్లే పండినరు. గద్దపాక సహకార సంఘంల అమ్మిన. కాంటకేసిన వడ్లు మిల్లుకు కూడా పోయినరు. కానీ ఒక్కపైసా ఇవ్వలే. యాసంగి పంటకు చేతుల పైసల్లేకపాయె' ఇదీ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామనికి చెందిన పిన్రెడ్డి సావిత్రమ్మ ఆవేదన.