Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ చైతన్యం పెరగాలి..
- పెట్టుబడిదారీ సమాజం సమస్యల్ని పరిష్కరించలేదు
- ప్రతిఖండానికీ, దేశానికీ డబ్ల్యూఎఫ్టీయూను తీసుకెళ్తాం
- సీఐటీయూ పోరాటాలకు అభినందనలు : డబ్ల్యూఎఫ్టీయూ అధ్యక్షులు మావంటిల్ మైఖేల్ మాక్వైబ చెన్నై నుంచి
నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్
ప్రపంచవ్యాప్తంగా వర్గపోరాటాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతతో పాటు రాజకీయచైతన్యం పెరగాల్సిన అవసరమున్న దని డబ్ల్యూఎఫ్టీయూ అధ్యక్షులు మావంటిల్ మైఖేల్ మాక్వైబ అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని చెన్నై నగరంలో గల మహ్మద్ అమీన్ నగర్లోని సుకోమల్సేన్ వేదికగా జరుగుతున్న సీఐటీయూ 16వ అఖిల భారత మహాసభలలో ఆయన మాట్లాడారు.. వర్గ సమస్యలేమిటి? వర్గ పోరాటమంటే ఏమిటి? శత్రువులెవరు? మిత్రులెవరు? అనే విషయాన్ని పక్కాగా తెలుసుకుని ముందడుగు వేయాలన్నారు. మన శత్రువులెవరనే దానిపై స్పష్టమైన అవగా హనతో ఉండాలని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తలెత్తిన పరిణామాలతో డబ్ల్యూఎఫ్టీయూ ఆవిర్భవించిందన్నారు. నేడు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేందుకు అమెరికా కుట్ర పన్నుతున్నదనీ, భవిష్యత్లోనూ తన ఎత్తుగడలను కొనసాగించే అవకాశం ఉందని విమర్శించారు. మూడో ప్రపంచ యుద్ధం కనుకవస్తే...అందుకు అమెరికానే కారణమవుతుందని ఆరోపించారు. నివారణకు కార్మిక పోరాటాలు దోహదపడాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా 4.3 బిలియన్ల(43కోట్ల మంది) నిరుద్యోగులు ఉన్నారనీ, అందులో మహిళలే ఎక్కువని వివరించారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు పోరాటాలు చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కార్మికుల పోరాటాలను బలోపేతం చేయాలనీ, అందుకు డబ్ల్యూఎఫ్టీయూ పూర్తిగా కృషి చేస్తుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలను ఒకే వేదికపైకి పిలిచి లెనిన్ రచించిన 'ఏం చేయాలి?' అనే పుస్తకంపై సమగ్రం చర్చించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇప్పుడున్న పెట్టుబడిదారీ వర్గ సమాజం సమస్యల్ని పరిష్కరించలేదన్నారు. ప్రపంచంలోని సమస్యలు కార్మిక వర్గ పోరాట విజయవంతం ద్వారానే పరిష్కారమవుతాయన్నారు. భారతదేశంలో మతం పేరిట ప్రజల్నీ, కార్మికుల్ని విడగొట్టి ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు, ఫాసిస్టు పాలనకు బీజం పడుతున్నట్టు ఈ మహాసభ ద్వారా తనకు అర్థమైందన్నారు. పలు దేశాల్లో కూడా ఈ పరిస్థితి ఉందని ఆందోళన వెలిబుచ్చారు. డబ్ల్యూఎఫ్టీయూ పోరాటాలకు ఇండియాలోని కార్మిక సంఘాలు ఎంతో దోహదపడ్డాయని తెలిపారు. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న కార్మిక పోరాటాలకు డబ్ల్యూఎఫ్టీయూ మద్దతు పూర్తిగా ఉంటుందని ప్రకటించారు. కార్మికవర్గానికి చేరుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి సుకోమల్ సేన్ నుంచి నేర్చుకున్నానన్నారు. పెట్టుబడిదారీ సమాజాన్ని కూలదోసేందుకు, ఫాసిజాన్ని ఎదుర్కొనేందుకు మరిన్ని పోరాటాలు అవసరమనీ, అదే సందర్భంలో కార్మికుల్లో రాజకీయ చైతన్యం కల్పించడం కూడా కీలకమని నొక్కి చెప్పారు. మహిళా సమస్యలపై పోరాటాలు చేసే క్రమంలో అనేక అవరోధాలు ఎదుర్కొన్నామని తెలిపారు. మహిళా పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రపంచ కార్మిక పోరాటాలను ఐక్యం చేయడం కోసం ముందుకెళ్తామన్నారు. బూర్జువా పార్టీల కనుసన్నల్లో ఉండే కార్మిక సంఘాలను ఎదుర్కొని ముందుకెళ్లేలా ఉద్యమాల రూపకల్పన ఉండాలన్నారు. పెట్టుబడిదారీ సమాజానికి వ్యతిరేకంగా డబ్ల్యూఎఫ్టీయూ ఇచ్చే పిలుపులను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, ప్రపంచ కార్మిక పోరాటాలకు మద్దతు తెలపాలని వేదిక నుంచి మైఖేల్ పిలుపునిచ్చారు.
సౌహార్ద సందేశాలు
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు
సుభాష్ లంబా, రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, తమిళనాడు కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామనీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, కార్మిక సంఘాల పిలుపుల్లో పాలుపంచుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సుభాష్ లంబా అన్నారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల గురించి విస్తృతంగా ఉద్యోగుల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరుస్తామని హామీనిచ్చారు. వేల కోట్లు ఖర్చుపెట్టి తమకు అనుకూలమైన వారిని పెట్టుబడిదారులు చట్టసభల్లోకి ఎలా పంపుతున్నారనే విషయాన్ని క్షేత్రస్థాయిలో వివరిస్తామన్నారు. ప్రత్యామ్నాయ విధానాల ఆవశ్యకత గురించి విడమర్చి చెబుతామన్నారు.
ఆర్థిక, హక్కుల పోరాటాల్లో మహిళలు పాల్గొనాలి
మరియం ధావలే( ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి)
ఆర్థిక, హక్కుల పోరాటాల్లో మహిళలు చురుగ్గా పాల్గొనాలని ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు. మోడీ, అమిత్షా దూకుడు విధానాలతో దేశం నేడు ప్రమాదపుటంచుల్లో ఉందని ఆందోళన వెలిబుచ్చారు. కార్మిక, మహిళ, ప్రజల హక్కులను కాలరాసే ప్రయత్నాన్ని వేగతరం చేశారన్నారు. పౌరసత్వ చట్టం పేరుతో ముస్లింలను వేరు చేసే కుట్ర జరుగుతున్నదన్నారు. లౌకిక విలువలకు మోడీ సర్కారు తూట్లు పొడుస్తున్నదనీ, మనువాదాన్ని మహిళలపై రుద్ది వారికి అసలు హక్కులే అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వ విధానాల వల్ల మహిళలకు ఉపాధి తగ్గిందన్నారు. మోడీ సర్కారు దాష్టీకాన్ని ఎదుర్కొనేందుకు సీఐటీయూతో కలిసి ఐద్వాగా పనిచేస్తామని ప్రకటించారు. స్కీమ్ వర్కర్ల పట్ల మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాజకీయంగా మతం పేరిట విభజన సృష్టించాలనుకున్న మోడీ, అమిత్షా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు ఐక్యపోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. మహిళలు ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ రెండు చోట్ల పనిచేస్తారనీ, వారి శ్రమను గుర్తించి విలువలతో కూడిన జీవితాన్ని అందించినప్పుడే విజయం సాధించినట్టన్నారు.
తీర్మానం
మార్చి 6న జైల్భరో జయప్రదానికి పిలుపు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 6న తలపెట్టిన జైల్భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ నేత ఏఆర్ సింధూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా...మరో నేత ప్రశాంత నంది చౌదరి బలపరిచారు. సీఐటీయూ 16వ మహాసభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఏఆర్ సింధూ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక దేశంలో రోజురోజుకీ మహిళలపైనా, చిన్న పిల్లలపైనా దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. మహిళలు దేశంలో రెండో పౌరురాలిగా బతకాల్సి వస్తున్నదన్నారు. మరోవైపు ప్యూహాత్మకంగానే మహిళ ఉపాధికి గండికొట్టే చర్యలకు మోడీ సర్కారు పూనుకున్నదన్నారు. 2004లో మహిళలకు ఉపాధి 41.6 శాతం ఉండగా...2017-18 వచ్చే నాటికి అది 22 శాతానికి పడిపోయిన విషయాన్ని పలు సర్వేలు నొక్కి చెపుతున్నాయని వివరించారు. వారిచేత రాత్రి షిప్టులు చేయించడం దారుణమన్నారు. మహిళలు చేసే పనికి విలువ లేకుండా పోతున్నదని వాపోయారు. సమాన పనికి సమాన వేతనం ఎక్కడా దక్కట్లేదన్నారు. తమకిష్టమైన చట్టాలను చేసుకుంటూ పోతున్న మోడీ సర్కారుకు మహిళా బిల్లును పాస్ చేయాలనే ఆలోచన లేదన్నారు. మనుస్మృతి భావాలను సమాజంలో జొప్పిఇంచి మహిళలను బానిసలుగా చూసే కుట్రకు బీజేపీ పూనుకుంటున్నదన్నారు. ఈ నేపథ్యంలోనే 'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. మహిళలపైనా, చిన్నారులపైనా వేధింపులు, లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయాలి. మహిళా బిల్లును ఆమోదించి చట్టరూపం కల్పించాలి. తదితర డిమాండ్లతో ఈ ఏడాది మన దేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జైల్భరో నిర్వహించనున్నట్టు ఏఆర్ సింధూ తీర్మాన ఉద్దేశాన్ని వివరించారు. ఈ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
వామపక్ష సాహిత్య ముద్రణలో నవతెలంగాణ భేష్
- బుక్స్టాల్ ప్రారంభంలో కేరళ మంత్రి మెర్సికుట్టి అమ్మ
వామపక్ష సాహిత్యాన్ని ముద్రించడం లోనూ, పుస్తక ప్రియులకు అందించడంలోనూ నవతెలంగాణ పబ్లిషర్స్ పాత్ర భేష్ అని కేరళ మత్స్య, ఆర్బర్ ఇంజినీరింగ్, జీడిపప్పు పరిశ్రమ శాఖల మంత్రి మెర్సికుట్టి అమ్మ కొనియాడారు. సీఐటీయూ 16వ మహాసభల ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నవతెలంగాణ బుక్స్టాల్ను సీఐటీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సాయిబాబు, చుక్కరాములుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాసభల ప్రాంగణంలో బుక్స్టాల్ను ప్రారంభించడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానన్నారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో విరివిగా వామపక్ష భావజాల సాహిత్యాన్ని ముద్రిస్తున్న నవతెలంగాణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 1100 వరకు టైటిల్స్, అరుదుగా లభించే పుస్తకాలను మహాసభల ప్రతినిధులకు అందుబాటులో ఉంచడం మంచి పరిణామమన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్లమెంట్లో చేసిన ప్రసంగాలను ఒక్కచోట కూర్చి నవతెలంగాణ పబ్లిషర్స్ ముద్రించిన 'అడ్వాన్సింగ్ పీపుల్స్ స్ట్రగుల్స్' వాల్యూమ్-1, వాల్యూమ్-2 పుస్తకాలను కాంప్లిమెంటరీగా ఎం.సాయిబాబు, చుక్కరాములు చేతుల మీదుగా మంత్రి మెర్సికుట్టి అమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు జె.వెంకటేశ్, పాలడుగు భాస్కర్, తుమ్మల వీరారెడ్డి, కళ్యాణం వెంకటేశ్వర్రావు, నాగేశ్వర్, పద్మ, నూర్జహాన్, బుక్స్టాల్ నిర్వాహకులు పి.సురేశ్ తదితరులు పాల్గొన్నారు.