Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్వంత విధానాలు అమలు
- ప్రాంతీయ బూర్జువా పార్టీల పరిస్థితీ ఇదే
- ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ జితింద్ర చౌదరి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
బీజేపీ పాలనలో ఆదివాసీల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ కన్వీనర్ జితింద్రచౌదరి అన్నారు. మలుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఆదివాసీ గిరిజన సంఘం ద్వితీయ రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు ప్రమాదంలో పడ్డాయన్నారు. వేలాది మంది ప్రాణత్యాగాలతో స్వాతంత్య్రం తెచ్చుకొని రాజ్యంగాన్ని రచించుకుంటే దీనికి విరుద్ధంగా మనుస్మృతి ఆధారంగా బీజేపీ పాలన సాగిస్తున్నదని అన్నారు. సిపాయిల తిరుగుబాటుకు పూర్వమే బ్రిటీష్వారికి వ్యతిరేకంగా సంతాల్ తెగ ఆదివాసీలు తిరుగుబాటు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా వచ్చిన అటవీహక్కుల చట్టం అమలు చేయడంలో గత ఐదున్నర ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
త్రిపురలో ఆదివాసీ చట్టాలు అమలు
త్రిపురలో సీపీఐ(ఎం) ప్రభుత్వ పాలనలో అటవీ హక్కుల చట్టాన్ని 99.9 శాతం అమలు చేశామని, పోడు చేస్తున్నవారి అందరికీ పట్టాలు ఇచ్చి వ్యవసా యం, పండ్లతోటల పెంపకం వంటి 8 విభాగాలకు రుణ సౌకర్యం కల్పించామని జితింద్రచౌదరి చెప్పారు. అదే రాష్ట్రంలో 23 నెలల బీజేపీ పాలనలో 961 పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు.
సంఘటిత పోరాటాల ద్వారానే హక్కుల పరిరక్షణ
బీజేపీ సిద్ధాంత భావజాలానికి వ్యతిరేకంగా ఆదివాసీలు, దళితులతో పాటు కష్టజీవులు అంతా ఏకమై పోరాడాలని జితింద్ర పిలుపునిచ్చారు. దేశంలోని 45 ఆదివాసీ పార్లమెంట్ నియోజక వర్గాల్లో 36 నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాధించినా ఆదివాసీలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఎర్రజెండా పట్టుకుని ఆదివాసీలు ఉద్యమాలు చేయాలన్నారు. రాజ్యాంగ హక్కులను కాపాడు కోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభలో మాజీ ఎంపీ మిడియం బాబురావు, ఆదివాసీ గిరిజన సంఘం రాఫ్ట్రకార్యదర్శి తొడసం భీంరావ్, ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, సోమయ్య, రైతుసంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, సూడికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.