Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెజారిటీ రాని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలపై గులాబీ బాస్ నజర్
- ఎక్స్ అఫిషియోలకు దిశానిర్దేశం
- టీఆర్ఎస్ 'ఆపరేషన్ ఆకర్ష్'
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని తొమ్మిది కార్పొరేషన్లు, 120 మున్సిపాల్టీలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక సోమవారం జరగనున్నది. ఉదయం 11 గంటలకు ఎన్నికైన వార్డు, డివిజన్ సభ్యులు ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం మేయర్, ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని వాటిపై టీఆర్ఎస్ దృష్టి కేంద్రీకరించింది. మూడు కార్పొరేషన్లతో పాటు దాదాపు 20 వరకున్న ఇలాంటి మున్సిపాల్టీల్లో చైర్పర్సన్ కోసం పావులు కదుపుతోంది. ఎక్స్ అఫిషియో సభ్యులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు) తాము ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గ పరిధిలోని ఏదేని ఒక కార్పొరేషన్ లేదా మున్సిపాల్టీలో ఇప్పటికే ఆప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎక్స్ అఫిషియో సభ్యులున్నప్పటికీ ఇంకా మెజారిటీ తక్కువగా ఉన్న వాటితో పాటు లేని చోట ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టేందుకు గులాబీ రాష్ట్ర నాయకత్వం మంత్రులు, జిల్లా నాయకులను రంగంలోకి దించింది. ఇతర పార్టీల సభ్యులను కూడా ఆకర్షించేందుకు మంతనాలు జరుపుతుండటంతో తమ సభ్యులను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలు ఆరోపణలు చేశాయి. నిజామాబాద్లో టీఆర్ఎస్
మిత్రపక్షంతో ఎంఐఎంతో కలిసి మెజారిటీలో ఉండగా, మెజారిటీ రాని కార్పొరేషన్లు రామగుండం, బడంగ్పేట్, మీర్పేటను తన ఖాతాలో వేసుకునేందుకు ఎత్తులు వేసింది. రామగుండంలో మొత్తం 50 స్థానాలకుగాను మేయర్ కోసం 25 స్థానాలు అవసరం కాగా టీఆర్ఎస్ 18 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ పార్టీకి ఇంకా 7 స్థానాలు అవసరం. ఇక్కడ 15 మంది ఇతరులు గెలవడం గమనార్హం. అదే విధంగా బడంగ్పేట్లో 32 స్థానాలుండగా మేయర్ కోసం 16 స్థానాలు అవసరం. కాగా టీఆర్ఎస్ 13 గెలుచుకోగా మరో మూడు కావాల్సి ఉంది. మీర్పేటలో 46కు 24 అవసరం కాగా 19 దగ్గరే ఆగిపోయింది. ఇంకా ఐదుగురు సభ్యులు కావాలి.
మున్సిపాల్టీల్లో...... అయిజ మున్సిపాల్టీలో 20కి గాను కేవలం ఆరు మంది సభ్యులే ఉన్నా టీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. ఆ పార్టీ జిల్లా నాయకులు రంగంలో దిగి ఇండిపెండెంట్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. జనగామలో మొత్తం స్థానాలు 30 ఉండగా టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 10,బీజేపీ 4, ఇతరులు 3 గెలుచుకున్నారు. ఖానాపూర్లో 12 స్థానాలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరి ఐదు చొప్పున గెలుచుకోగా బీజేపీ నుంచి ఒకరుండగా, ఇతరులు ఇంకొకరున్నారు. నస్పూర్లో 25 స్థానాలకు టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 6, బీజేపీ 3, ఇతరులు 4, సీపీఐ నుంచి ఇద్దరున్నారు. మణికొండలో టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 8, బీజేపీ 6, ఇతరులు ఒక స్థానాల్లో ఉండటంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. భూత్పూర్లో టీఆర్ఎస్, బీజేపీలు చెరి నాలుగేసి చొప్పున గెలుచుకోగా కాంగ్రెస్కు రెండు సీట్లు వచ్చాయి. కొస్గిలో రెండు సీట్లు గెలుచుకున్న ఇతరులు కీలకంగా మారారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏడేసి వార్డుల చొప్పున సమానంగా గెలుచుకోగా మెజారిటీకి 8 సీట్లు అవసరమున్నాయి.
అమరచింత మున్సిపాల్టీ....
వనపర్తి జిల్లాలోని 10 స్థానాలున్న అమరచింత మున్సిపాల్టీ అంతుచిక్కడం లేదు. ఇక్కడ టీఆర్ఎస్ మూడు స్థానాలతో సరిపెట్టుకోగా సీపీఐ(ఎం) రెండు స్థానాలు, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, తెలుగుదేశం ఒక్కో స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. మిగిలిన ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఇక్కడ ఎవరు ఎవరికి మద్దతిస్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.