Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లు ఆరెస్సెస్ చేతిలో త్రిశూలం లాంటివి
- ఆనాడు బ్రిటీష్.. నేడు బీజేపీ...
- ఇద్దరిదీ విభజించి పాలించు విధానమే
- తెలంగాణ సీఎం ప్రకటన హర్షణీయం
- రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు శపథం చేద్దాం : బహిరంగ సభలో సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్
- ఎన్పీఆర్కు వివరాలివ్వొద్దని పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఆనాటి బ్రిటీష్ వారిది నేటి బీజేపీది విభజించి పాలించాలనే విధానమే' అని సీపీఐ (ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందా కరత్ వ్యాఖ్యా నించారు. తెల్లదొరలు జనాన్ని ఎక్కడికక్కడ చీల్చటం ద్వారా తమ పబ్బం గడుపుకోవాలని చూస్తే.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజల మధ్య మత చిచ్చుపెట్టి ప్రధాన సమస్యల నుంచి దేశం దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా 'రాజ్యాం గాన్ని కాపాడుకుందా'మంటూ
సీపీఐ (ఎం) ఆధ్వర్యాన ఆదివారం హైదరాబాద్లోని అంబర్పేటలో బహిరంగ సభను నిర్వహించారు. పార్టీ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎమ్.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో.. బృందాకరత్తోపాటు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, టి.జ్యోతి, సియాసత్ ఎడిటర్ అమర్ అలీఖాన్, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్.శ్రీనివాసరావు, కెఎల్ రాజన్న, కమిటీ సభ్యులు మహేందర్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. నగర కార్యదర్శివర్గ సభ్యురాలు అరుణజ్యోతి రాజ్యాంగ ప్రవేశిక చదివి.. సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. బృందాకరత్ మాట్లాడుతూ... సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ అనేవి ఆరెస్సెస్ చేతిలో త్రిశూలం లాంటివని.. వీటి వల్ల దేశ ఐక్యతకు, మత సామరస్యానికి తీరని విఘాతం కలుగుతుం దని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో వీటిని అమలు చేయబోమంటూ కేరళ ముఖ్య మంత్రి పినరయి విజయన్ దేశంలో మొట్ట మొదటిసారిగా ప్రకటించారని గుర్తుచేశారు. కాస్త ఆలస్యంగానైనా తెలంగాణ సీఎం కేసీఆర్.. సీఏఏను వ్యతిరేకిస్తూ మాట్లాడ టం హర్షణీయమన్నారు. ఇదే విధంగా అన్ని రాష్ట్రాలూ ప్రకటించాలని కోరారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక అనేవి ముస్లింలకు సంబంధించిన సమస్యలే కావని తెలిపారు. ఇవి దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఆఖరికి హిందువులకు సంబంధించిన సమస్యలు కూడా అని గుర్తుచేశారు. ప్రస్తుతం తరంలో అనేక మందికి జనన ధృవీకరణ పత్రాల్లేవని చెప్పారు. అలాంటప్పుడు మన తల్లి దండ్రులు, తాతల బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు కోట్ల సంఖ్య లో ఉన్న ఈ దేశంలో... ఇప్పుడు సర్టిఫికెట్లు చూపించట మే ప్రధానమా..? అని ప్రశ్నించారు. కూలి కోసం, ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని నెలకో ఊరు తిరిగే సంచార జాతులు, గిరిజన తెగల వారు తాము ఎక్కడ, ఎప్పుడు పుట్టామో చెప్పగలరా..? అని అన్నారు. నిరుద్యోగం, ఆకలి, రైతుల ఆత్మహత్యలు తదితర ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోడీ ప్రభుత్వం ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏలను ముందుకు తెచ్చిందని ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబరు వరకూ నిర్వహించబోయే ఎన్పీఆర్ ప్రక్రియకు సహకరించవద్దని ప్రజలకు సూచించారు. ఇందుకోసం ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే అధికారుల ప్రశ్నలకు మనం ఆన్సర్లివ్వాల్సిన అవసరం లేదన్నారు. వారికి 'మేం జవాబులు చెప్పబోం...' అంటూ గట్టి సమాధానాలివ్వాలని పిలుపునిచ్చారు. బీజేపీ హయాంలో దేశంలో మత సామరస్యానికి, లౌకికత్వానికి తీరని విఘాతం కలుగుతున్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకుందామంటూ శపథం చేయాలని పిలుపునిచ్చారు. డిజి మాట్లాడుతూ... ప్రజల ఆహార్యంపైనా, ఆహారపు అలవాట్లపైనా బీజేపీ, ఆరెస్సెస్ దాడి చేస్తున్నాయని విమర్శించారు. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలకు షాక్నిచ్చిందని తెలిపారు. రెండోసారి గద్దెనెక్కిన తర్వాత... జమ్మూ కాశ్మీర్ను ముక్కలు చేయటమేగాక మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలన్నింటినీ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.