Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైనా.. గైర్హాజరుగా ప్రకటించిన వైనం
- 10వేల మంది విద్యార్థులను ఫెయిల్ చేసిన ఘనులు
- తప్పు మాది కాదంటే.. మాది కాదు
- డిగ్రీ ఫలితాల్లో యూనివర్సిటీ, కాలేజీల దాటవేత
- సాఫ్ట్వేర్ సమస్యలే కారణమంటున్న ప్రొఫెసర్లు
- ఇదీ ఓయూ డిగ్రీ కాలేజీల ఫలితాల తీరు
నవతెలంగాణ- సిటీబ్యూరో/ఓయూ
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పేరుతో చేస్తున్న హడావుడితో డిగ్రీ, పీజీ పరీక్షల ఫలితాల్లో గందరగోళం నెలకొంది. గతేడాది గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యంతో ఇంటర్మీడియట్ ఫలితాలలో తప్పులు దొర్లిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాల కారణంగా వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే తరహాలో డిగ్రీ ఫలితాల్లోనూ ఆన్లైన్ మూల్యాంకనం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళానికి తమ బాధ్యత కాదని ఒక పక్క యూనివర్సిటీ.. మరో పక్క డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే, డిగ్రీ ఫలితాల్లో అవకతవకలు జరగడానికి ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగంతోపాటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల బాధ్యతా ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఓయూ పరిధిలో..
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాతోపాటు హైదరాబాద్ జిల్లాలో సుమారు 408 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 22 స్వయం ప్రతిపత్తి కాలేజీలు, 12 రెసిడెన్షియల్ కాలేజీలు, 23 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 351 అనుబంధ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల పరీక్షలు రాసే విద్యార్థులు సుమారు 2.83లక్షల మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
ఆన్లైన్ మూల్యాంకనం ఇలా..
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో సీట్లను దోస్త్ ద్వారా కేటాయిస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మొదలుపెడితే మార్కుల మెమో పొందేవరకు అంతా ఆన్లైన్ ప్రక్రియలోనే చేస్తున్నారు. ఈ ప్రక్రియను నిర్వహించడానికి నాలుగు సాఫ్ట్వేర్ ఏజెన్సీలకు ఉస్మానియా యూనివర్సిటీ అప్పగించింది. ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ఫామ్తోపాటు హాల్టికెట్ను జనరేట్ చేపే ప్రక్రియను ఒక ఏజెన్సీకి, పరీక్షల జవాబు పత్రాలపై బార్కోడ్ స్టిక్కర్ను ప్రింట్ చేయడంతోపాటు యూనిక్ ఐడీ ఇచ్చే అంశాన్ని మరోక ఏజెన్సీకి అప్పగించారు. ఆన్లైన్ మూల్యాంకనంలో జవాబుపత్రాలను స్కాన్ చేయడంతో ప్రశ్నాపత్రం కోడ్ ఇచ్చే బాధ్యతను ఇంకోక ఏజెన్సీకి అప్పగించారు. హాల్టికెట్, బార్కోడింగ్ స్టిక్కర్, ప్రశ్నాపత్రం కోడ్లను మ్యాపింగ్(సరిచూస్తారు) చేస్తారు. ఆ తర్వాత ఈ మూడింటితోపాటు మూల్యాంకనంలో వచ్చిన మార్కులు వేసి నాలుగో ఏజెన్సీకి పంపిస్తారు. ఈ నాలుగో ఎజెన్సీ విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోను ప్రింట్ చేస్తుంది. ఈ ప్రక్రియలో మార్కుల జాబితాను ఓయూ పరీక్షల విభాగానికి పంపిస్తారు. ఈ మార్కులకు సంబంధించిన డేటాబేస్ను పరిశీలించి ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కానీ ఆన్లైన్ మూల్యాంకానికి సంబంధించిన డేటాబేస్ను పరిశీలించకపోవడంతోపాటు ఆయా కాలేజీల నుంచి యూనివర్సిటీకి పంపించిన ఫామ్-డి(విద్యార్థులకు సంబంధించిన హాజరు)ను పరిశీలించకుండానే ఫలితాలు ప్రకటించారని పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హాజరైనా.. గైర్హాజరు
పరీక్షలకు హాజరైనా 10వేల మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు, ఫెయిలైనట్టుగా ఫలితాల్లో ప్రకటించారు. అన్ని సబ్జెక్ట్స్లో టాపర్గా నిలిచిన విద్యార్థులను అసలు పరీక్షలకు హాజరుకానట్టుగా వెల్లడించారు. కొందరికి ప్రాక్టికల్ మార్కులు యాడ్ కాలేదు. మరికొందరి విషయంలో చివరి నిమిషంలో సెంటర్ల మార్పు వల్ల కొన్ని తప్పులు జరిగాయి. ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండానే అధికారులు డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు. విత్హెల్డ్లో పెట్టాల్సిన సమాచారాన్ని బహిరంగం చేయడంతో విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి లోనవు తున్నారు. పరీక్షలు బాగా రాసినా ఫేయిల్ కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తమకు న్యాయం చేయాలని చేయాలంటే.. అధికారులు తప్పించుకుని తిరుగుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డల భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారు.
కళాశాల ప్రిన్సిపల్స్, ఇన్విజిలెటర్స్ వల్లే..
కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్
కళాశాలల ప్రిన్సిపల్స్, ఇన్విజిలేటర్స్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. ఎలక్టీవ్స్తోనూ సమస్య వచ్చింది. విద్యార్థులు కూడా ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ కాకుండా పరీక్షాకేంద్రాల్లో వేరే పేపర్ రాయడమూ ఒక కారణం. ప్రశ్నాపత్రాల కోడ్ తేడా వల్ల ఆ విద్యార్థుల ఫలితాలు విత్హెల్డ్లో పెట్టాం.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఓయూ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తున్నారు. గతంలో ఇంటర్మీడియట్లో కూడా గ్లోబరినా సంస్థ తప్పులకు విద్యార్థులు బలయ్యారు. ఇప్పుడు ఓయూ సాఫ్ట్వేర్ ఏజెన్సీల కారణంగా విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు యూనివర్సిటీ ప్రతిష్టతను దిగజారుస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
గ్రేటర్ హైదరాబాద్ ఏబీవీపీ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి
అధికారులు, పరీక్షల విభాగం కంట్రోలర్ నిర్లక్ష్యం కారణంగానే అవకతవకలు జరిగాయి. దీనికి ఓయూ అధికారులే బాధ్యత వహించాలి. ఫామ్-డిలో హాజరైనట్టు ఉంటే ఫలితాల్లో గైర్హాజరు ఎలా వస్తుంది. రీవాల్యూవేషన్ ఉచితంగా చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
విచారణ జరిపించాలి
రెడ్డి శ్రీనివాస్- జేవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల అవకతవకలపై పూర్తి విచారణ జరిపించాలి. తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలి. కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి.