Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెంచిన వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రజలతో అవసరం లేదన్నట్టుగా మోడీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరను పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారాలు మోపిందని విమర్శించారు. ఇప్పటికే మండుతున్న నిత్యావసరాల ధరలతో ప్రజలు సతమతమవుతుంటే ప్రస్తుతం వంటగ్యాస్ ధరను పెంచడం దారుణమని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.769 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరకు అదనంగా రూ.148.50 పెంచిందని పేర్కొన్నారు. దీంతో సిలిండర్ ధర రూ.917.50 చేరిందని తెలిపారు. ఒక్కో సిలిండర్పై సబ్సిడీ పోను రూ.10.55 వినియోగదారులపై భారం పడుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ పిలుపుమేరకు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకున్న వినియోగదారులపైనా ఇది పెనుభారంగా మారుతుందని తెలిపారు. నిత్యావసర సరుకుల నియంత్రణపై ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇప్పటికే పప్పులు, నూనెలు, కూరగాయలు, పాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనికి వంటగ్యాస్ ధర పెంచడంతో ప్రజలను పెనం నుంచి పొయ్యిలోకి నెట్టినట్టవుతున్నదని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం వెంటనే పెంచిన వంటగ్యాస్ ధరను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.7 వేల కోట్లు చెల్లించాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.7 వేల కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్రీకృతం చేసి ఆర్థికంగా వాటిని దివాళా తీయిస్తున్నదని విమర్శించారు. దీంతో అన్ని రాష్ట్రాలూ కేంద్రంపై ఆధారపడేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలిపారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకునే ప్రయత్నాలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీతోపాటు, వివిధ సంక్షేమ పథకాల బకాయిలను చెల్లించకుండా, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని తెలిపారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగి రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా వెళ్లడించారని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థికమాంద్యం పరిస్థితుల రీత్యా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ చెల్లించాల్సిన బకాయి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై పోరాడి ఆయా రాష్ట్రాలకు రావాల్సిన ఆర్థిక వనరులను సాధించుకోవాలని సూచించారు.
గ్యాస్ ధర పెంపుపై వినూత్న నిరసన
- కార్పొరేట్ల లాభాల కోసమే పెంపు అంటూ జనం ఆగ్రహం
వంట గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సీపీఐ(ఎం), సీపీఐ, ప్రజాసంఘా ల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల లాభాల కోసమే విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం నగరంలోని సరితా క్లినిక్ సెంటర్లో గ్యాస్ బండలు పక్కనబెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడారు.సీపీఐ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతుంటే.. ఒకేసారి వంటగ్యాస్ ధర రూ.145 పెంచడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.