Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నికరంగా విదిల్చింది రూ.16 వేల కోట్లే..
- స్కీములతో సంబంధం లేకుండా రూ.లక్షా 20 వేల కోట్లు కేటాయించాలి
- కేంద్రానిది రైతు వ్యతిరేక బడ్జెట్ : ఏఐకేఎస్సీసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ని పథకాలు, కార్యక్రమాలుపోను వ్యవసాయ రంగానికి కేంద్రం విదిల్చింది రూ.16,800 కోట్లేనని పలువురు రైతు నేతలు విమర్శించారు. ఆ రంగాన్ని గట్టెక్కించాలంటే ఆయా స్కీములతో సంబంధం లేకుండా రూ.లక్షా 20 వేల కోట్లివ్వాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కారు ప్రవేశపెట్టింది కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక బడ్జెట్టని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేయటం ద్వారా వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో రైతులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్సీసీ) ఆధ్వర్యాన గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్ర వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ... జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం... 2018లో దేశవ్యాప్తంగా 11 వేల మంది, 2019లో మరో 12 వేల రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే... కిసాన్ సమ్మాన్ నిధికి రూ.75 వేల కోట్లు, ఫసల్ బీమా యోజనకు రూ.14 వేల కోట్లు, వడ్డీ మాఫీ కోసం రూ.18 వేల కోట్లు, కృషి సించారు యోజన కింద 99 ప్రాజెక్టులకు రూ.4 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇవన్నీపోను వ్యవసాయ రంగానికి కేటాయించింది రూ.16,800 కోట్లేనని వివరించారు. అందువల్ల ఈ కేటాయింపులతో రైతులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతాంగ సంక్షేమానికి కేటాయింపులు పెంచాల్సిన తరుణంలో అందుకు విరుద్ధంగా తగ్గించటం అన్యాయమని అన్నారు. రైతుల ఆదాయాలు, పొదుపులు, ఆహార భద్రత మెరుగుదలకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్ మాట్లాడుతూ... ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ కేటాయింపులను రూ.71 వేల కోట్ల నుంచి రూ.61 వేల కోట్లకు తగ్గించటం దారుణమని అన్నారు. వాస్తవానికి దీనికి రూ.లక్ష కోట్లు కేటాయించాలంటూ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని తెలిపారు. రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్ మాట్లాడుతూ... బడ్జెట్లో కేటాయింపులకు, ప్రభుత్వం చేసే ఖర్చుకు ఎంతో వ్యత్యాసముంటున్నదని తెలిపారు. రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ... కనీస మద్దతు ధరల కోసం 2018-19లో రూ.1,500 కోట్లను కేటాయించిన కేంద్రం, అందులో కేవలం రూ.321 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాడిగల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు, వ్యకాస నాయకురాలు బొప్పిని పద్మ, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మానాయక్, వేములపల్లి వెంకటరామయ్య (ఏఐకేఎంఎస్), అచ్యుత రామారావు (అఖిల భారత రైతు కూలీ సంఘం), కన్నెగంటి రవి (తెలంగాణ రైతు జేఏసీ), నాగిరెడ్డి (తెలంగాణ రైతు కూలీ సంఘం), శంకర్ (డీబీఎఫ్) తదితరులు పాల్గొన్నారు.