Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాలు
- గోదావరి జలాల సద్వినియోగానికి కార్యాచరణ
- సాగునీటి కాలువలకు మే ఆఖరులోగా మరమ్మతులు
- అన్ని చెరువులను నింపేలా ప్రణాళిక
- జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ విభాగాల్లో ఖాళీల భర్తీ : ముఖ్యమంత్రి కేసీఆర్
నవతెలంగాణ- కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ మహదేవ్పూర్
రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజినీంగ్ విభాగాలను అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఆపరేషన్ రూల్స్ కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి సీఎం కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్కు వచ్చారు. గురువారం ఉదయం హెలిక్యాప్టర్లో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి వచ్చారు. తొలుత గోదావరి పుష్కరఘాట్లో గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముక్తేశ్వరం స్వామిని దర్శించుకున్నారు. 'కాళేశ్వర ఖండం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. వ్యూ పాయింట్ వద్ద ఇంజినీర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం వరదనీరు ఉధృతంగా చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి ఎప్పటికప్పుడూ నీటిని తోడుకోవాలన్నారు. అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. అనంతరం మేడిగడ్డ వద్ద క్యాంప్ కార్యాలయంలో భోజనం చేసి, అధికారులు, మంత్రులతో మాట్లాడాక సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్కు చేరుకున్నారు. సాగునీటి రంగంపై ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు నిర్ణయాలు వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సాగునీటి లక్ష్య సాధనకు ఇంజినీరింగ్, ఇరిగేషన్ విభాగాల పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్టు చెప్పారు. సాగునీటికి సంబంధించి అన్ని ఇంజినీరింగ్ విభాగాలు ఒకే గొడుగు కిందికి తీసుకొస్తామన్నారు. అందులో భాగంగానే సాగునీటి ఇంజినీరింగ్ వ్యవస్థను 11 సర్కిల్స్గా విభజన చేస్తున్నట్టు వివరించారు. వాటికి అధిపతిగా చీఫ్ ఇంజినీర్ ఒక్కడే ఉంటారని చెప్పారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేలా అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని, సాగునీటి కాలువలకు మే నెలాఖరులోగా అవసరమైన అన్ని మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు
కరీంనగర్, నిజామాబాద్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలు
కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు వెంటనే నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్, సలహాదారు రాజీవ్శర్మ ఉన్నారు.