Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణంతో మూడు జిల్లాలకు సాగునీరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు గోదావరి నీటిని తరలించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే దుమ్మగూడెం వద్ద పెద్ద బ్యారేజీ నిర్మాణానికి రూపకల్పన చేసింది. రూ. 3,400 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజీ వద్ద 37 టీఎంసీలను నిల్వ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత గోదావరిపై రెండవ అతి పెద్ద ప్రాజెక్టుగా దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణం జరగబోతున్నదని అధికారులంటున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు నీటి నిల్వ సమస్యను అధిగమించటంతో పాటూ కొత్తగా సాగర్ ఆయకట్టును గోదావరి నీటితో స్థిరీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసి 60 రోజుల్లో 60 టీఎంసీల నీటిని తరలించటం ద్వారా పూర్వపు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని 6.5 లక్షల ఎకరాలకు సాగునీరందించటానికి సీతారామ ప్రాజెక్టును చేపట్టారు. దుమ్ముగూడెం వద్ద 150 ఏండ్ల క్రితం నిర్మించిన కాటన్ బ్యారేజీపై ఆధారపడి సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఈ బ్యారేజీ వద్ద నీటి నిల్వ కేవలం 5 టీఎంసీలకు మించి ఉండక పోవటంతో గోదావరికి వరదలు రాని కాలంలో నీరు చాలదని ఇంజినీర్లు ప్రభుత్వానికి తెలిపారు. కాటన్ బ్యారేజీ ఎత్తును పెంచాలనే ప్రతిపాదన కూడా వచ్చినప్పటికీ ఇది పురాతన కాలం నాటిది కావటంతో సాంకేతికంగా సాధ్యం కాదని నిపుణులు తేల్చటంతో కొత్త బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. కొత్త బ్యారేజీ నిర్మాణం తర్వాత ఎండాకాలంలో కూడా నీరు నిల్వ ఉంటుందని తాగు నీటికి అవసరమైతే తరలించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త బ్యారేజీ నిర్మాణం తర్వాత సాగు నీరందించే అదనపు ఆయకట్టుతో పాటు సాగర్ ఆయకట్టు స్థిరీకరణపై ఇంకా స్పష్టత రాలేదు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో తరచుగా నెలకొంటున్న వర్షాభావ పరిస్థితులతో పాటు కర్నాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచితే సాగర్ ఆయకట్టుకు నీరందటం కష్టమేనని ప్రభుత్వం భావిస్తున్నది. మూడేండ్ల కొకసారి మాత్రమే సాగర్ ఎడమ కాల్వకు నీరందుతున్నది. ఇది దృష్టిలో పెట్టుకుని గోదావరి నీటిని సాగర్ ఆయకట్టుకు తరలించే ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ఎంచుకున్నది. పాలేరు, వైరా, రోళ్లపాడు, బయ్యారం వంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో అధికంగా నీటిని నిల్వ చేసి సాగర్ ఆయకట్టుకు నీరందించే విధంగా కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు కొత్త బ్యారేజీ నిర్మాణం తర్వాత సాగునీరందతుందని అధికారులు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కోసం తీసుకునే నీటికి అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించే ప్రతిపాదన ప్రభుత్వం ముందున్నది. దుమ్ముగూడెం కొత్త బ్యారేజీ, హైడల్ విద్యుత్ కేంద్రంతో పాటూ అదనపు పనుల కోసం రూ. 14,000 కోట్లు ఖర్చవుతుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. గోదావరి నీటిని సాగర్ ఆయకట్టుకు తరలించటానికి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దుమ్ముగూడెం టైల్పాండ్ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని రద్దు చేశారు.
ఉమ్మడి ప్రాజెక్టుకు స్వస్తి...
గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించే ఉమ్మడి ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత సంవత్సరం కలిసిన తర్వాత ఈ దిశగా కొంత ప్రయత్నం జరిగినప్పటికీ రెండు రాష్ట్రాలకు చెందిన విశ్రాంత ఇంజినీర్లు వ్యతిరేకించటంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. పోలవరం నుంచి నేరుగా కృష్ణా బేసిన్కు నీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించటంతో ఉమ్మడి ప్రాజెక్టు ప్రయత్నాలకు గండి పడింది. ఇదే సమయంలో కేంద్రం ప్రతిపాదించిన గోదావరి-కృష్ణా-కావేరి లింక్ పథకం కూడా కార్యరూపం దాల్చలేదు. అకినేపల్లి, లేదా ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి నీటిని తరలించే రెండు పథకాలను కేంద్రం ప్రతిపాదించినప్పటికీ రెండు రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన రాక పోవటంతో ఈ పథకంపై కేంద్రం ముందడుగు వేయలేదు.