Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిన్నరగా రుణాల్లేవు
- రూ.619 కోట్లు వాడుకున్న ఆర్టీసీ యాజమాన్యం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సహకార రుణ పరపతి సంఘం (సీసీఎస్)లో నిధులు లేవు. ఉద్యోగులు తమ వేతనాల్లో నుంచి దాచుకున్న రూ.619 కోట్ల సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం స్వంతానికి వాడేసుకున్నది. ఫలితంగా ఏడాదిన్నరగా ఒక్క ఉద్యోగికి కూడా రుణ సదుపాయం కలుగలేదు. దీనిపై గతంలో కార్మిక సంఘాలు పలు ఆందోళనలు చేశాయి. ప్రస్తుతం ఆర్టీసీలో యూనియన్లు లేవంటూ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మె సమయంలో హైకోర్టులో నడిచిన కేసు సందర్భంగా 2019 డిసెంబర్ 17లోపు సీసీఎస్కు రూ.200 కోట్లు చెల్లిస్తామని యాజమాన్యం తెలిపింది. ఆ గడువు ముగిసి రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. యాజమాన్యం సకాలంలో సొమ్ము చెల్లించనందున ఖాతాదారులు రూ.73 కోట్ల వడ్డీని నష్టపోవాల్సి వచ్చిందని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఆర్టీసీలో రిటైరైన ఉద్యోగులకు 2018 ఏప్రిల్ నుంచి బకాయిలు (సెటిల్మెంట్స్) చెల్లించలేదు. పిల్లల ఉన్నత చదువులు, ఇంటి నిర్మాణం, వివాహాలు సహా అనేక కార్యక్రమాలకు ఉద్యోగులు సాధారణంగా సీసీఎస్ రుణాలపై ఆధారపడుతూ ఉంటారు. రిటైరైన ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. సీసీఎస్లో ఫిక్సెడ్ డిపాజిట్లు చేసుకున్నవారు తమ సొమ్ము తిరిగి ఇచ్చేయాలని దరఖాస్తులు చేసుకున్నా ప్రయోజనం లేకుండా ఉంది. డిసెంబర్ 17 నాటికి రూ.200 కోట్లు ఇస్తామని హైకోర్టుకు తెలిపిన ఆర్టీసీ యాజమాన్యంపై సీసీఎస్ పాలకమండలి కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేయకపోవడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా పాలకమండలి యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
మా సొమ్ము మాకివ్వండి: ఎస్బాబు, అధ్యక్షులు, ఎంప్లాయీస్ యూనియన్
ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లోంచి పొదుపు చేసుకున్న సొమ్మును తిరిగి వారికే ఇచ్చేయడానికి యాజమాన్యానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కోర్టుకు ఇచ్చిన హామీకి కూడా ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడలేదు. దీనిపై పాలకమండలి మౌనంగా ఉండటం సరికాదు. కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేయాలి. ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సీఎం కేసీఆర్ దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి.
వడ్డీ నష్టం
యాజమాన్యం సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వల్ల సీసీఎస్ ఖాతాదారులు వడ్డీ నష్టపోతున్నారు. మొత్తం ఇవ్వాలని మేం గతంలో ఆందోళనలు చేస్తే, వాయిదాల్లో ఇస్తామన్నారు. కోర్టుకు కూడా అదే విషయం చెప్పారు. ఇప్పుడు ఆ నిధుల ఊసే ఎత్తట్లేదు. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. యాజమాన్యం, ప్రభుత్వం తక్షణం దీనిపై నిర్ణయం తీసుకోవాలి. పాలకమండలి ఆ దిశగా ఒత్తిడి తేవాలి.
- వీఎస్ రావు, ప్రధాన కార్యదర్శి, టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్