Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏపై తీర్మానం..
- ఎన్పీఆర్, ఎన్నార్సీపై మౌనం...
- ఆ పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఏఏను వ్యతిరేకిస్తున్నామంటూ ప్రకటించిన టీఆర్ఎస్ సర్కారు.. ఎన్పీఆర్, ఎన్నార్సీపై మాత్రం స్పష్టతనివ్వలేదు. గత ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని వ్యతిరేకించిన ప్రభుత్వం... అందుకనుగుణంగా శాసనసభలో తీర్మానం కూడా చేస్తామంటూ ప్రకటించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), దాని ఆధారంగా రూపొందించబోయే జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్నార్సీ) గురించి క్యాబినెట్లో ఒక్క ముక్క కూడా ప్రస్తావించకపోవటం గమనార్హం. దీనిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆరు రాష్ట్రాలు తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం మొట్టమొదటగా అసెంబ్లీలో తీర్మానించింది. ఆ తర్వాత.. పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బంగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఇప్పటి వరకూ స్పందించలేదు. మరోవైపు జనగణనకు సంబంధించి కేంద్ర
ప్రభుత్వం జనవరి తొమ్మిదో తేదీన విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈనెల 11న జీవో జారీ చేశారు. ఇందులో వ్యక్తుల వివరాలతోపాటు వారు నివాసముండే ఇంటికి సంబంధించిన అన్ని అంశాలనూ సవివరంగా పొందుపరచాలంటూ పేర్కొన్నారు. దాని ప్రకారం తమ ఇంటికొచ్చే గణాంక అధికారులు ఇచ్చే ప్రతిని చదివి, అందులో ఉన్న 31 అంశాలకు ప్రజలు సమాధానాలను పొందుపరచాల్చి ఉంటుంది. ఇదే సమయంలో జన గణనతోపాటు ఎన్పీఆర్కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే వివరాల నమోదు, వాటి సేకరణ చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రణాళికాశాఖ, జిల్లాల కలెక్టర్ల సంయుక్త ఆధ్వర్యాన కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇందుకోసం పాఠశాల ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్లుగానూ, సూపర్ వైజర్లుగాను నియమిం చాలంటూ ఆర్డర్లు జారీ చేశారు. వీరికి మార్చిలో శిక్షణనివ్వాలంటూ సూచించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభించాలంటూ కలెక్టర్లు.. జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాతపూర్వక ఉత్తర్వులను కూడా వారు విడుదల చేశారు. అయితే వచ్చే ఏప్రిల్లో కేవలం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని నివాసాలు, వాటిలో ఉండే కుటుంబ సభ్యుల వివరాలను మాత్రమే ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారని ప్రణాళికా శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి సేకరణ పూర్తయిన తర్వాత అవే గణాంకాల ఆధారంగా 2021 ఏప్రిల్లో ఎన్పీఆర్ను అధికారులు తయారు చేస్తారని వారు సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది చేపట్టబోయే ఎన్పీఆర్ సమగ్ర స్వరూప రూపకల్పన కోసం 2021 జనవరి ఒకటి నుంచి మార్చి 15 వరకు ఉన్న అన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ పాఠశాల విద్యాశాఖ అదనపు కార్యదర్శి ఎమ్.లలిత.. ఈనెల 13న జిల్లా స్థాయి అధికారులకు మెమో జారీ చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సంబంధించిన సంఖ్య, వారి వివరాలను పేర్కొంటూ బుధవారం (ఈనెల 19) నాటికి నివేదిక తయారు చేయాలంటూ ఆ జిల్లా కలెక్టరు, జనగణన ముఖ్య అధికారి హరిత... విద్యాశాఖాధికారికి రాత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. ఇదే తరహాలో మిగతా అన్ని జిల్లాల్లోనూ ఆర్డర్లు ఇచ్చినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రక్రియలు జరుగుతున్నా, శిక్షణ కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన రాజకీయ వైఖరిని ప్రకటించకపోవటం గమనార్హం. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు లేకుండానే కిందిస్థాయిలో ఇలాంటి చర్యలు ప్రారంభమవుతాయా..? అనే సందేహాలు తలెత్తుతు న్నాయి. దీనిపై కొందరు టీఆర్ఎస్ నేతలను వివరణ కోరేం దుకు ప్రయత్నించగా... వారికి కూడా వీటిపై స్పష్టత లేకపోవటం గమనార్హం. ముఖ్యమంత్రి ఎన్నార్సీ, ఎన్పీఆర్ల విషయంలో నిర్దిష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఈ చర్చకు తెరపడదు. నిజానికి శాసనసభలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం మాత్రమే చాలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్ల కు సహకరించజాలమని కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే కేంద్రం మీద ఒత్తిడి తేవటం సాధ్యపడుతుందని మేధావులూ, రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.