Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటిని అమ్మి బడ్జెట్లో కలపాలనుకోవడం దుర్మార్గం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హౌజింగ్ బోర్డు భూములను అమ్మి ఆ డబ్బును రాష్ట్ర బడ్జెట్కు కలపాలన్న ప్రభుత్వ ఆలోచన అత్యంత దుర్మార్గమైం దని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శిం చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హౌజింగ్బోర్డు కోసం సేకరించిన భూముల్లో మిగిలిన 871 ఎకరాలను పేదలకు ఇండ్ల నిర్మాణం, ఇంటిస్థలాల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. హౌజింగ్బోర్డు భూములు పట్టణానికి ఆనుకుని ఉన్న నేపథ్యంలో అవి పేదలకు ఇండ్లస్థలాలుగా ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. హైదరాబా ద్ పరిసర ప్రాంతాల్లోనూ, రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ, పేదల నుంచి హౌజింగ్బోర్డు అతి తక్కువ ధరలకు భూములను సేకరించిందని పేర్కొన్నారు. కొంత భూమిలో రాజీవ్ స్వగృహ కింద ఇండ్ల నిర్మాణం చేసిందని తెలిపారు. కోకాపేట్లో అతితక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి వందల కోట్ల రూపాయలకు అమ్మి ఖజానా నింపుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని వివరించారు. దానిపై కోర్టులో కేసులూ వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భూములనూ అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. వరంగల్, నల్లగొండ జిల్లాల్లోనూ హౌజింగ్బోర్డు కోసం భూములు సేకరించారని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇండ్ల నిర్మాణ పథకాలన్నీ పెండింగ్లోనే ఉన్నాయని వివరించారు. డబుల్బెడ్రూం ఇండ్లు 2.73 లక్షల మందికి మంజూరు చేసి ఆరేండ్లు గడిచినా 50 శాతం కూడా ప్రారంభించలేదని పేర్కొన్నారు. అంతకుముందు చేపట్టిన 1,2,3 దశల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు కూడా పూర్తిగా లబ్ధిదారులకు అందలేదని తెలిపారు. లక్షల గృహాలు అవినీతిమయం అయ్యాయని ఆరోపణలొచ్చినా ఆ కేసులను పరిష్కరించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూప్రక్షాళన సర్వేలో లక్షల ఎకరాలలు నేటికీ బీళ్లుగానే ఉన్నాయని తేలిందని వివరించారు. దీనిని బట్టి గత, ప్రస్తుత ప్రభుత్వాలు తక్కువ ధరకు సేకరించిన భూములు సంబంధిత పనికి వినియోగించకపోవడంతో భూములిచ్చిన రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. మరోవైపున భూమి వినియోగంలోకి రాకుండా పోయిందని తెలిపారు. పట్టణ ప్రాంతాలకు వలసొచ్చిన వారే కాకుండా ఇక్కడున్న మురికివాడల్లోని లక్షల మందికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేవని పేర్కొన్నారు. ఈ వాస్తవం ప్రభుత్వానికి తెలియదా?అని ప్రశ్నించారు. పేదలకు డబుల్బెడ్రం ఇండ్లు ప్రభుత్వ ప్రచారానికే తప్ప వాస్తవంగా ఆచరణ రూపం దాల్చింది నామమాత్రమేనని తెలిపారు. ప్రభుత్వం ఇండ్లు లేనివారి గణాంకాలు సేకరించి అందరికీ హౌజింగ్బోర్డు భూముల్లో ఇండ్లస్థలాలు ఇవ్వాలని కోరారు. అంతేగానీ ఆ భూములు అమ్మి డబ్బు పోగేసుకోవడం సరైన చర్య కాదని తెలిపారు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్గా మారి పేదల భూములను బలవంతంగా సేకరించి అతి ఎక్కువ లాభాలకు అమ్ముకోవడానికి పూనుకుంటున్నదని విమర్శించారు. ఇప్పటికే లక్షల ఎకరాల భూమి సేకరించి సంబంధిత పనులకు కేటాయించకుండా బీళ్లుగా మార్చిన దుస్థితి రాష్ట్రంలో ఉందని తెలిపారు. నేటికీ ఇండ్ల స్థలాల కోసం పేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని పేర్కొన్నారు. సమస్య తీవ్రతను గమనించి హౌజింగ్బోర్డు భూములను పేదలకు ఇండ్ల నిర్మాణం, ఇండ్ల స్థలాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.