Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో గాల్లో తేలుతూ కిందపడ్డ వైనం
- యువకుడు మృతి, ఆరుగురికి గాయాలు
నవతెలంగాణ-అమీర్పేట
గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కారు కిందపడి బీభత్సం సృష్టించిన ఘటన నుంచి నగరవాసులు తేరుకోకముందే మరో ఘటన కలకలం రేపింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు భరత్నగర్ బ్రిడ్జిపై అదుపు తప్పి ఫుల్పాత్ను ఢీ కొట్టి గాల్లోకి లేచింది. అక్కడ్నుంచి కిందపడటంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున ఈ ఘటనతో జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎస్ఐ నరసింహగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు కూకట్పల్లి నుంచి సనత్నగర్ వైపు ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది. వాహనం అదుపుతప్పి భరత్నగర్ బ్రిడ్జిపైనున్న ఫుట్పాత్ను ఢీ కొట్టింది. గాల్లోకి తేలుతూనే ఒక్కసారిగా కిందపడిపోయిది. అందులో ఏడుగురు ప్రయాణిస్తుండగా మూసాపేట ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్కు చెందిన షఫీ కుమారుడు సోహెల్ (22) మరణించాడు. డ్రైవర్ సునీల్, అక్షక్, సోహెల్, ఇర్ఫాన్, గౌస్, మోయిన్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు కిందపడగానే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. బాధితులు బోరబండ పండిట్ నెహ్రూ నగర్కు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మతుడు సొహైల్ తండ్రి షఫీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్ఐ తెలిపారు.