Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీపై మళ్లీ దాటవేత...
- బిశ్వాల్ కమిటీ గడువు డిసెంబర్కు పొడిగింపు
- ఆశలపై సర్కారు నీళ్లు
- ఐఆర్ లేదు... ఫిట్మెంటూ లేదు : సంఘాల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆశలు మరోసారి అడియాశలయ్యాయి. వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) కమిటీ గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ అమలుపై ప్రభుత్వం దాటవేత వైఖరిని అమలు చేస్తున్నది. ఎంప్లాయిఫ్రెండ్లీ అంటూనే ఉద్యోగులకు నష్టం చేకూర్చే విధానాలు ఆచరిస్తున్నది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు షాక్ తగిలింది. పీఆర్సీ గడువు పెంచి ఉద్యోగుల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. పీఆర్సీ కమిటీ చైర్మెన్ సిఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని కమిటీకి ఈనెల 25 వరకు గతంలో గడువు పొడిగించిన విషయం తెలిసిందే.
ఆ గడువు పూర్తి కావస్తున్న నేపథ్యం లో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఆశించారు. త్వరలోనే తీపికబురు వస్తుందని భావిస్తున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పిడుగు పడింది. పీఆర్సీ గడువును డిసెంబర్ వరకు పొడిగిస్తూ జీవో నెంబర్ 447ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర భృతి (ఐఆర్) అయినా ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అమలుకు నోచుకోని సీఎం హామీ
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. 2018, మే 16న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లతో సీఎం సమావేశం నిర్వహించారు. '2018, జూన్ 2న మధ్యంతర భృతి (ఐఆర్), ఆగస్టు 15న పీఆర్సీ ప్రకటిస్తాం'అని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2018, జూన్ 2న ఐఆర్ ప్రకటించలేదు. ఆగస్టు 15న పీఆర్సీ రాలేదు. 2019, జూన్ 2న, ఆగస్టు 15న సైతం ఐఆర్, పీఆర్సీ ఏదీ ప్రకటించలేదు. అయినా పీఆర్సీ గడు వును డిసెంబర్ వరకు పొడిగించడంతో ఈ ఏడాది జూన్ 2, ఆగస్టు 15న సైతం ఐఆర్, పీఆర్సీ వచ్చే అవకాశం లేదు. ఇంకోవైపు పీఆర్సీ నివేదికను త్వరగా రూపొందించడం కోసమే ఏకసభ్య కమిషన్ స్థానంలో 2018, మే 18న త్రిసభ్య కమిషన్ను వేశారు. మాజీ ఐఏఎస్ అధికారులు సిఆర్ బిశ్వాల్, సి ఉమా మహేశ్వరరావు, రఫత్అలీని పీఆర్సీ కమిటీ సభ్యులుగా నియమించారు. హుజూ ర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా పీఆర్సీ ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశించారు. ఫలితాల తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని 2019, నవంబర్ 10న హామీ ఇచ్చారు. పది రోజుల్లో నివేదిక రూపొందిం చాలని పీఆర్సీ కమిటీని ఆదేశించారు. ఇంతలోనే గుట్టుచప్పుడు కాకుండా పీఆర్సీ కమిటీ గడువును ఆర్నెల్లు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి జీవోనెంబర్ 3006ను 2019, నవంబర్ 19న జారీ చేశారు. ఆ గడువు ముగియక ముందే డిసెంబర్ వరకు పీఆర్సీ గడువును మరోసారి పొడిగించడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. లెక్కప్రకారం 2018, జులై ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలి. ఇప్పటికే 20 నెలలు ఆలస్యమైంది. డిసెంబర్ వరకు గడువు పొడిగించడంతో 30 నెలలు ఆలస్యమవుతుంది. జాప్యం చేసినా ఉద్యోగులకు కనీసం మ ధ్యంతర భృతి (ఐఆర్) కూడా ప్రకటించ కపోవడం గమనార్హం. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కూడా ఇంతటి నిర్లక్ష్యాన్ని ప్రద ర్శించలేదు. ఏపీలో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇప్పటికే అమలవుతున్నది. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ ఐఆర్ లేదు... ఫిట్మెంటూ ప్రకటించక పోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు.
వంచించిన ప్రభుత్వం : యూఎస్పీసీ, జాక్టో
ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వంచించిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, జి సదానందంగౌడ్, ఎం పర్వతరెడ్డి, కె రమణ, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్రెడ్డి, టి లింగారెడ్డి, ఎం రాధాకృష్ణ, చంద్రశేఖర్, కె కృష్ణుడు, యు పోచయ్య, డి సైదులు, షౌకత్అలీ, ఎన్ చెన్నరాములు, ఇ లక్ష్మన్నాయక్, శర్మన్, కె రమేష్, యాదగిరి, జాడి రాజన్న, జాదవ్ వెంకట్రావ్, కె జయబాబు, మసూద్ అహ్మద్, రహమాన్, ఎ గంగాధర్, ఎం పద్మారావు, ఎస్ హరికృష్ణ, శ్రీనునాయక్, శాగకైలాసం, చింతా రమేష్, బి కొండయ్య, ఎస్ మహేష్, కె రామారావు, ఎస్ లక్ష్మినారాయణ సంయుక్తంగా ఓ ప్రకటనలో విమర్శించారు. పీఆర్సీ గడువును పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు.
ఐఆర్ ప్రకటించాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 27 శాతం ఐఆర్ ప్రకటించాలని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పి శ్రీపాల్రెడ్డి, బి కమలాకర్రావు ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ కమిటీ గడువు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే 40 శాతం ఐఆర్ ప్రకటించాలని ఇంటర్ విద్య జేఏసీ చైర్మెన్ పి మధుసూదన్రెడ్డి కోరారు. పీఆర్సీ గడువు పెంపు సరైంది కాదని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం చెన్నయ్య తెలిపారు. ఆర్థిక మాంద్యం సాకుతో పీఆర్సీ గడువు పెంచడం ఉద్యోగులు, ఉపాధ్యాయులను వంచన చేయడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ దిగజారుడు విధానాలకు నిదర్శనమని టీఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి అబ్దుల్లా, రాజిరెడ్డి విమర్శించారు. పీఆర్సీ గడువు పెంపుపై సీఎం కేసీఆర్ పునరాలోచన చేయాలని టీపీయూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, సురేష్ కోరారు. ఐఆర్ ప్రకటించాలనీ, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలనీ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షలు సంపత్కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి జి బాలస్వామి తెలిపారు. పీఆర్సీ గడువు పెంచడాన్ని టీటీసీ అధ్యక్షులు మల్లయ్య ఖండించారు. 45 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ గడువును పొడిగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఎస్జీటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్రావు, కె మహిపాల్రెడ్డి కోరారు.
గడువు పెంచడం సరికాదు: టీయూఎంహెచ్ఈయూ
పీఆర్సీ నివేదిక సమర్పణ గడువు మరోసారి పెంచడం సరికాదని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ విమర్శించింది. ఈ మేరకు మంగళవారం యూనియన్ అధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
గడువు పెంపు అన్యాయం : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
పీఆర్సీ కమిటీ గడువు పెంపు అన్యాయమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. పీఆర్సీ నివేదికను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు త్రిసభ్య కమిటీ నియమిస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. ఈ గడువు పెంపుతో రెండున్నరేండ్లు అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మోసగించడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. గత పీఆర్సీ తెలంగాణ, ఏపీలో 2013, జులై నుంచి అమలైందని గుర్తు చేశారు. ఏపీలో ఐఆర్ 27 శాతం అమలవుతున్నదని వివరించారు. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉన్నదనీ, నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.