Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణాలు, నగరాలను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం...
- పని చేయకపోతే పదవుల నుంచి తప్పుకోండి : మున్సిపల్ సమ్మేళనంలో మేయర్లు, చైర్పర్సన్లకు సీఎం హెచ్చరికలు
- అధికారం, హోదాతో మనిషి మారకూడదంటూ వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. మూడు నెలల్లో పబ్లిక్ టాయిట్లెను నిర్మించాలనీ, ఎనిమిది నెలల్లో కరెంటు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. లేదంటే సంబంధిత ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిధుల వినియోగంలో ఖచ్చితమైన క్రమశిక్షణను పాటించాలని సూచించారు. ప్రణాళికల ప్రకారమే వ్యయం చేయాలని కోరారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులకు సీఎం కర్తవ్యబోధ చేశారు. ఈనెల 24 నుంచి వచ్చే నెల 4 వరకు నిర్వహించబోయే పట్టణ ప్రగతి విధి విధానాలను ఆయన వివరించారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలనే అంశాన్ని సోదాహరణంగా వివరించారు. భర్తృహరి సుభాషితాలను, ఏనుగు లక్ష్మణ కవి పద్యాలను చదివి వినిపించారు.
'మీరు కర్తవ్యాన్ని నిర్వహించడంలో విజయాన్ని సాధించాలి. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభవాలుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభమయ్యాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతోనూ, త్యాగంతోను కూడుకుని ఉండేవి. బ్రిటీష్ వారి వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయి. అప్పట్లో ఆత్మార్పణ, త్యాగం అయితే నేడు స్వేచ్ఛా భారతంలో ఉన్నాం. జాతి నిర్మాణ రంగంలో మనమంతా మమేకమైపోయాం. దీన్ని గుర్తెరిగి పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది. ప్రజా నాయకులుగా ఎదిగితే, అదే జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్పర్సన్లయ్యే అవకాశమొచ్చింది. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. విధి నిర్వహణలో విఫలం కావద్దు. పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిది. ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సీిఎం చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థమవుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేశాం. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నాం. ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. చాలా మందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. అలా ఉండకూడదు. అవగాహనతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి...' అని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.
పారదర్శక విధానాలు కావాలి...
'మున్సిపాల్టీ అంటేనే మురికికీ, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరుగా అవి రూపాంతరం చెందాయి. బల్దియా .. ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయి. అలాంటి చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలను అవలంభించాలి. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలి, అడ్డదిడ్డంగా ఎటుపడితే అటు కాదు. అది మీ చేతుల్లో ఉంది...' అని ముఖ్యమంత్రి చెప్పారు.
'ప్రజా ప్రతినిధులు డంబాచారాలు పలకొద్దు. అన్ని పనులు ఓవర్నైట్లో చేసేస్తాం అని మాట్లాడొద్దు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ వేసుకోవాలి. మంచి అవగాహన ఏర్పర్చుకోవాలి. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకుని పోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి. ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి. ప్రగతికాముకంగా ముందుకు సాగాలి. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి...' అని సూచించారు.
పంచాయతీ అధికారులపై గుస్సా...
పల్లెప్రగతి కార్యక్రమాన్ని సమీక్షించేందుకోసం గ్రామాల్లో పర్యటించాల్సిన మండల పంచాయతీ అధికారులు... ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. వారి పనితీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాల్లో రాత్రి బస చేయాలని ఆదేశించారు. తద్వారా పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమాల పునాదిగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. దళితవాడలు, పేదలు నివసించే ప్రాంతాల నుంచే దీన్ని ప్రారంభించాలని ఆదేశించారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారించాలని కోరారు. వార్డుల వారీగా ప్రణాళికలు రూపొందించుకుని వాటికి అనుగుణంగా పనులు చేసుకుంటూ పోవాలని చెప్పారు. సమ్మేళనంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్లు, చైర్పర్సన్లతో ముఖాముఖి నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, పట్టణ పరిపాలన కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్పర్సన్లు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
సీఎం చెప్పిన ముఖ్యాంశాలు...
- కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇండ్ల నిర్మాణం, లే అవుట్ విషయంలో సులభతరమైన అనుమతుల విధానం తెచ్చాం. ప్రజలపై నమ్మకం ఉంచాం. ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
- జీవో నెంబరు 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇండ్లను క్రమబద్ధీకరించినట్టే. అన్ని మున్సిపాల్టీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది.
- రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే చేపడుతుంది. ఇందులో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలి. ఎవరికి వారు పూనుకుని తమ ప్రాంతంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.