Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అబ్జర్వేషన్ హౌమ్స్లో వసతుల లేమిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అబ్జర్వేషన్ హౌమ్స్లో కనీస సౌకర్యాలు లేవని పేర్కొంటూ కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి రాసిన లేఖను హైకోర్టు పిల్గా పరిగణించి బుధవారం విచారణ జరిపింది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, జైళ్ల శాఖ ఐజీ, కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం నోటీసులిచ్చింది. కరీంనగర్ జిల్లాలోని వెలిచాల, స్వాధార్ ఏరియాల్లో ప్రభుత్వ పర్యవేక్షణలోని అబ్జర్వేషన్ హౌమ్స్లో వసతులు లేకపోవడాన్ని హైకోర్టు దృష్టికి లేఖ ద్వారా కరీంనగర్ జిల్లా జడ్జి తీసుకొచ్చారు. ఈ పిల్పై విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.
'హుస్సేన్సాగర్' ఆక్రమణలపై వివరణ ఇవ్వండి
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు వడ్డాణంలా ఉన్న హుస్సేన్సాగర్ ఏరియాలో ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హుస్సేన్సాగర్ పరిధిలో ఆక్రమణలపై సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా పరిగణనలోకి తీసుకున్నది. చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ఆ పిల్పై బుధవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డులకు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా వేసింది.
సభలు, ర్యాలీలకు అనుమతి కాలయాపనపై హౌంశాఖకు నోటీసులు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిరసన సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు పోలీసులు తీవ్ర కాలయాపన చేస్తున్నారనీ, చిట్టచివరిలో అనుమతికి గ్రీన్ సిగల్ ఇస్తున్నారని వేసిన పిల్ విషయంలో డీజీపీ, హౌంశాఖ ముఖ్యకార్యదర్శి, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్లకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలకు అనుమతి విషయంలో పోలీసులు కాలయాపన చేయటంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షఫీకుజ్జమాన్, మరో వ్యక్తి వేసిన పిల్ను హైకోర్టు విచారించింది. సభ, సమావేశాన్ని పెట్టుకునేందుకు అనుమతి కోరితే కుంటిసాకులు చెప్పి కాలయాపన చేస్తున్నారనీ, అప్లికేషన్ పెట్టుకున్న వారం రోజుల్లోగా పోలీసులు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకునేలా ఆర్డర్ ఇవ్వాలని పిల్లో కోరారు. దీనిని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. మూడు వారాలకు వాయిదా వేసింది.