Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2020-21)లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) నోటిఫికేషన్ ఈనెల 21న విడుదల కానుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పీఈసెట్ కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలిలో జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ సిహెచ్ గోపాల్రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్లు ఆర్ లింబాద్రి, వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, పీఈసెట్ కన్వీనర్ వి సత్యనారాయణతోపాటు ఇతర సభ్యులు హాజరయ్యారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్ 13వ తేదీ వరకు గడువుందని కన్వీనర్ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.500తో ఏప్రిల్ 22 వరకు, రూ.2 వేలతో ఏప్రిల్ 29 వరకు, రూ.5 వేలతో మే 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశముందని తెలిపారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ,ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 చెల్లించాలని సూచించారు. మే 13 నుంచి పీఈసెట్ రాతపరీక్షలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ పరీక్ష మాత్రమే ఆన్లైన్లో జరగబోదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 8వ తేదీ వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బీపీఈడీకి దరఖాస్తు చేసే అభ్యర్థులు డిగ్రీ చదివి ఉండాలనీ, 2020, జులై ఒకటి నాటికి 19 ఏండ్లు నిండి ఉండాలనీ కోరారు. డీపీఈడీలో చేరే అభ్యర్థులు ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలనీ, 2020, జులై ఒకటి నాటికి 16 ఏండ్లు నిండి ఉండాలనీ సూచించారు. పూర్తి వివరాలకు https://pecet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
మార్చి 12 నుంచి పీజీఈసెట్ దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2020-21) లో ఎంటెక్/ఎంఈ, ఎంఆర్క్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరిం గ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ మార్చి 4న విడుదల కానుంది. మార్చి 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పీజీఈసెట్ కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలిలో జరిగింది. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, పీజీఈసెట్ కన్వీనర్ ఎం కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువుందని తెలిపారు. ఆలస్య రుసుం రూ.500తో మే 6 వరకు, రూ.2 వేలతో మే 13 వరకు, రూ.5 వేలతో మే 20 వరకు, రూ.10 వేలతో మే 26వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశముందని వివరించారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.500, ఇతరులు రూ.1000 చెల్లించాలని సూచించారు. మే 28 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో రాతపరీక్షలు జరుగుతాయని తెలిపారు. మే 20 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జూన్ 15న ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. పీజీఈసెట్ రాతపరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్, వరంగల్లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పూర్తి వివరాలకు https://pgecet.tsche.ac.in లేదా http://www.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.