Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గజ్వేల్లో బ్యాంకు ఉద్యోగి దివ్యను దారుణంగా చంపిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రైం రిపోర్టు ప్రకారం నమోదవుతున్న కేసుల్లో 100కు 19 కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయనీ, మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారికి సరైన శిక్షలు పడకపోవడటం వల్లనే రోజురోజుకీ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖను ఆధునీకరిస్తున్నామన్న ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో మహిళలకు భద్రత శూన్యమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుని రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.